వేస్ట్‌ డీకంపోజర్‌’ ద్రావణం ఒక్కటి చాలు!

18 Sep, 2017 23:49 IST|Sakshi

‘వేస్ట్‌ డీకంపోజర్‌’ ఆవిష్కర్త, ఎన్‌.సి.ఒ.ఎఫ్‌. డైరెక్టర్‌ డా. క్రిషన్‌ చంద్రతో ‘సాగుబడి’ ముఖాముఖి

‘సాక్షి సాగుబడి’ పేజీ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ‘వేస్ట్‌ డీకంపోజర్‌’ ద్రావణం గురించి తెలుసుకున్న వేలాది మంది రైతులు దీన్ని సంపూర్ణ సేంద్రియ ఎరువుగా, పురుగుల మందుగా అన్ని రకాల పంటలపై వాడుతూ సత్ఫలితాలు పొందుతున్నారని ‘వేస్ట్‌ డీకంపోజర్‌’ ఆవిష్కర్త, ఘజియాబాద్‌(ఉత్తరప్రదేశ్‌)లోని ఎన్‌.సి.ఒ.ఎఫ్‌. డైరెక్టర్‌ డా. క్రిషన్‌ చంద్ర వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ఆయన ‘సాగుబడి’ ప్రతినిధితో ప్రత్యేకంగా ముచ్చటించారు.

తెలంగాణలోనే కనీసం 10 వేల మంది రైతులు వేస్ట్‌ డీకంపోజర్‌ ద్రావణాన్ని వాడుతున్నారని, తాము ఏ సమావేశానికి వెళ్లినా దీని ద్వారా పొందుతున్న సత్ఫలితాల గురించి రైతులు సంతోషంగా చెబుతున్నారని అన్నారు. అందువల్లనే డీకంపోజర్‌ సీసాలను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇది సేంద్రియ రైతులకు మాత్రమే కాకుండా రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు కూడా ఉపయోగమేనంటూ.. దీన్ని ఉపయోగిస్తే రసాయనిక ఎరువుల వాడకాన్ని ఈ పంట కాలంలోనే 70 శాతం వరకు తగ్గించుకోవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ 85 వేల మంది రైతుల ద్వారా వేస్ట్‌ డీకంపోజర్‌ ద్రావణంతో సేంద్రియ కూరగాయల సాగుకు ఉపక్రమిస్తున్నదని, ఇందుకు తమ పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నామన్నారు.

ప్రపంచంలోనే మొట్టమొదటిది..
రైతులు కంపెనీల వద్ద కొనుగోలు చేయకుండా తమంతట తామే పొలంలో తయారు చేసుకొని వాడుకోదగిన ఇటువంటి బహుళ ప్రయోజనకారి అయిన ద్రావణం ప్రపంచంలో మరే దేశంలోనూ లేదని డా. క్రిషన్‌ చంద్ర తెలిపారు.  ప్రతిసారీ కంపెనీల నుంచి కొని వాడుకునే జీవన ఎరువు/పురుగుమందులే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సేంద్రియ రైతులు పంటల సాగు క్రమంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం వెతకడమే లక్ష్యంగా.. 11 ఏళ్ల పాటు ప్రయోగాలు చేసి తాను ఈ డీకంపోజర్‌ ద్రావణాన్ని కనుగొన్నానన్నారు. రైతు రూ. 20తో కొంటే.. జీవితాంతం వాడుకోవచ్చన్నారు. 

ప్రతి 100 లీటర్ల నీటిలో కిలో బెల్లంతోపాటు ఒక డీకంపోజర్‌ బాటిల్‌లోని పొడిని కలుపుకోవాలని.. రోజుకోసారి కలియదిప్పుతూ ఉంటే 4 లేదా 5 రోజులకు ద్రావణం లేత గోధుమ రంగులోకి మారుతుందని, అప్పుడు వాడకానికి సిద్ధమైనట్టేనని డా. క్రిషన్‌ చంద్ర తెలిపారు. రసాయనిక ఎరువులు అతిగా వాడిన భూముల్లో ఎకరానికి నీటి తడి ఇచ్చిన ప్రతిసారీ 400 లీటర్ల ద్రావణాన్ని సాగునీటిలో కలిపి పారించాలని, 6 నెలల తర్వాత నుంచి 200 లీటర్లు వాడితే సరిపోతుందన్నారు. మోతాదు ఎక్కువైనా నష్టమేమీ ఉండదన్నారు. 6 నెలలకు సేంద్రియ కర్బనం, సూక్ష్మపోషకాలు, ఈసీ విలువ, ఉదజని విలువ సానుకూలంగా మారతాయన్నారు.

నెమటోడ్స్‌ను అరికడుతుంది..
3 దఫాలు సాగునీటితోపాటు ఈ ద్రావణాన్ని ఇస్తే పంటల్లో నెమటోడ్స్‌ (నులిపురుగుల) సమస్యను అధిగమించవచ్చని డా. క్రిషన్‌ చంద్ర చెప్పారు. అంతేకాదు మట్టి ద్వారా, గాలి ద్వారా, నీటి ద్వారా వచ్చే ఎటువంటి తెగుళ్లనైనా ఇది అరికడుతుందన్నారు. ఏ పంట మీదైనా 10 రోజులకోసారి పిచికారీ చేయాలన్నారు. 20 రోజులలోపు పంట అయితే 3 లీటర్ల ద్రావణాన్ని 7 లీటర్ల నీటిలో కలిపి చల్లాలని.. తర్వాతయితే ఈ ద్రావణాన్ని నీరు కలపకుండానే నేరుగా పిచికారీ చేయాలన్నారు.

గుంటూరు, మహబూబ్‌నగర్, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో రైతులు పత్తిలో వాడుతున్నారని, మిర్చిలో వైరస్‌ సమస్యను అధిగమించారని తెలిపారు. బయోగ్యాస్‌ తయారీలోనూ ఈ ద్రావణాన్ని వాడొచ్చన్నారు. బయోగ్యాస్‌ స్లర్రీపై దీన్ని చల్లితే 15 రోజుల్లో చక్కని ఎరువు తయారవుతుందన్నారు. వర్మీ కంపోస్టు బెడ్స్‌లో 70 శాతం తేమ ఉండేలా దీన్ని చల్లితే కేవలం 21 రోజుల్లో చక్కని వర్మీకంపోస్టు సిద్ధమవుతుందన్నారు.

ప్రాంతీయ మండళ్ల ద్వారా సేంద్రియ సర్టిఫికేషన్‌..
సేంద్రియ రైతులకు పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం(పీజీఎస్‌) ద్వారా సేంద్రియ వ్యవసాయ ధృవీకరణ ఇవ్వడంతోపాటు.. సేంద్రియ వ్యవసాయోత్పత్తుల కొనుగోలుదారులతో రైతులను అనుసంధానం చేయడానికి దేశవ్యాప్తంగా కేంద్ర వ్యవసాయ శాఖ గుర్తింపు పొందిన 600 ప్రాంతీయ మండళ్లు పనిచేస్తున్నాయని డా. క్రిషన్‌ చంద్ర వివరించారు. ఇందులో 45 ప్రైవేటు ఏజెన్సీలన్నారు. ఒక ఏజెన్సీ హైదరాబాద్‌లో రైతు సేవా కేంద్రాన్ని తెరిచిందని, అక్కడ వేస్ట్‌ డీకంపోజర్‌ సీసాలను కూడా రైతులు కొనుగోలు చేయొచ్చన్నారు. పీజీఎస్‌ గుర్తింపు పొందిన సేంద్రియ రైతులు తమ సొంత గ్రామం, జిల్లా, రాష్ట్ర సంబంధిత ప్రత్యేక బ్రాండ్ల ద్వారా తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చన్నారు.

పీజీఎస్‌ గుర్తింపు పొందిన రైతులు దేశంలో 2.5 లక్షల మంది ఉన్నారని, 30–40 శాతం వరకు అధికాదాయం పొందుతున్నారన్నారు. ప్రపంచ సేంద్రియ మహాసభ న్యూఢిల్లీలో నవంబర్‌లో తొలిసారి జరుగనుందని డా. క్రిషన్‌ చంద్ర తెలిపారు. 111 దేశాల నుంచి సేంద్రియ రైతులు హాజరవుతున్నారని, భారతీయ సేంద్రియ ఉత్పత్తులకు అంతర్జాతీయ ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. బీటీ పత్తి పంట వ్యర్థాలను కుళ్లబెట్టినప్పుడు అందులోని విషం ఎంతవరకు తగ్గుతున్నదనే అంశాన్ని పరిశీలించలేదన్నారు.
 

ఇంటిపంటలకు, దోమల నిర్మూలనకూ వేస్ట్‌ డీకంపోజర్‌ ఉపయోగకరమే..!
గుర్‌గావ్‌ వంటి చోట్ల ‘వేస్ట్‌ డీకంపోజర్‌’ ద్రావణాన్ని సేంద్రియ ఇంటిపంటల సాగులో విజయవంతంగా వాడుతున్నారని డా. క్రిషన్‌ చంద్ర తెలిపారు. ఈ ద్రావణం ఇంటి పట్టున వాడుకోవడానికి సురక్షితమైనదని తెలిపారు. చిన్న బక్కెట్‌లోకి కొంత వరకు ఈ ద్రావణం తీసుకొని.. అందులో రోజువారీ వంటింటి వ్యర్థాలను వేస్తూ ఉంటే.. 30 రోజుల్లో చక్కని పోషక ద్రావణం తయారవుతుందన్నారు.

దీనికి నీరు కలపకుండా నేరుగా సేంద్రియ ఇంటిపంటలకు, మొక్కలకు ద్రవరూప ఎరువుగా, పురుగుమందుగా వాడొచ్చన్నారు. మురుగుకాలువల దుర్వాసనను ఈ ద్రావణం చల్లిన గంటలో పోగొడుతుందన్నారు. దోమలను, ఈగలను సైతం పారదోలుతుందన్నారు. మరుగుదొడ్డి సెప్టిక్‌ ట్యాంక్‌లో 5 లీటర్ల ద్రావణం పోస్తే ట్యాంకులో వ్యర్థాలు కుళ్లిపోతాయని, గ్యాస్‌ వల్ల ట్యాంకుకు పగుళ్లు రాకుండా ఉంటాయన్నారు.

ఏడాది పాటు పీజీఎస్‌ సేవలు ఉచితం!
హైదరాబాద్‌లోనే ‘వేస్ట్‌ డీకంపోజర్‌’ సీసాల విక్రయం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పీజీఎస్‌) ద్వారా సేంద్రియ సర్టిఫికేషన్‌ పొంద దలచిన రైతులకు ఏడాది పాటు ఉచిత సేవలు అందిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి ప్రాంతీయ మండలిగా గుర్తింపు పొందిన మార్క్‌ అగ్రి జెనెటిక్స్‌ ప్రై. లిమిటెడ్‌ డైరెక్టర్‌ పి. చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తమ వద్ద పేర్లు నమోదు చేయించుకున్న రైతులకు సేంద్రియ సేద్యంలో శిక్షణ ఇవ్వడంతోపాటు సొంత బ్రాండ్‌ను రూపొందించుకొని.. దేశ, విదేశీ మార్కెట్లలో తమ సేంద్రియ ఉత్పత్తులను అమ్ముకోవడానికి తోడ్పడతామన్నారు. వేస్ట్‌ డీకంపోజర్‌ సీసాలను ఘజియాబాద్‌ నుంచి తెప్పించుకోనవసరం లేదని, హైదరాబాద్‌లోని తమ కార్యాలయం నుంచి రూ. 20లకు కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు.

వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా:  
మార్క్‌ ప్రోగ్రీన్‌ సేంద్రియ రైతుల సేవా కేంద్రం, 416/ఎ, బాబూఖాన్‌ ఎస్టేట్, బషీర్‌బాగ్, హైదరాబాద్‌–500001.
040– 23235858, 91009 80757.

మరిన్ని వార్తలు