మురి‘పాలు’ కావాలంటే..!

25 Nov, 2014 02:28 IST|Sakshi

చలికాలంలో పశువులపై దృష్టి సారించాలి  యాజమాన్య పద్ధతులు పాటించాలి
  సమీకృత దాణా విడిగా ఇవ్వాలి  శరీర ఉష్ణోగ్రత కోసం ప్రత్యేక ఆహారం ఇవ్వాలి
  సాధారణంగా 12గంటల వ్యవధిలో పాలు పితుకుతుంటారు. కానీ చలికాలంలో పగటిపూట సమయం తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో ఉదయం 6గంటల నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 4గంటల నుంచి 5గంటల మధ్య పాలు పితకడం మంచిది.
  శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూడాలి. శరీరం వేడిగా ఉండడానికి అదనపు ఆహారం ఇవ్వాలి. లేకపోతే మేత తినక పాల దిగుబడి తగ్గుతుంది.
  పశువులకు అందించే దాణాలో పిండి పదార్థాలు ఎక్కువగా, మాంసకృత్తులు తక్కువగా ఉండాలి.
  లూసర్న్, బర్సీం వంటి పశుగ్రాసాల సాగును చేపట్టి అధిక పాల దిగుబడి పొందాలి.

  వరి కోతలు పూర్తవగానే పొలంలో మిగిలి ఉన్న తేమతో జనుము వంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి.
  శీతాకాలంలో ఎక్కువగా పశువులు ఎదకొచ్చి పొర్లుతాయి. కాబట్టి ప్రతిరోజు పశువులను కనీసం రెండు మూడుసార్లు ముందూ, వెనకా పరిశీలించాలి. పశువు వెనక భాగంలో పరిశీలిస్తే, మూగ ఎదలో ఉన్న పశువులను గుర్తించడం వీలవుతుంది. గత ఎద పూర్తయిన తర్వాత 16-25 రోజుల్లో పశువుల ప్రవర్తనలో మార్పు, పాల దిగుబడిలో తగ్గుదలను బట్టి ఎదను గుర్తించాలి. వెంటనే వీర్యదానం చేయించాలి.

  చలిగాలులు, మంచు కురవడం వల్ల న్యూమోనియా సోకే ప్రమాదం ఉంది. గొంతు వాపు, గిట్టలు మెత్తబడడం, మేత తినకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
  పశువులు, దూడలను ఆరుబయటే కట్టేయకూడదు. ఈదురుగాలిని నిరోధించడానికి వాతావరణంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువైన సందర్భాల్లో పాకల చుట్టూ పరదాలు కట్టాలి.
  లేగ దూడల వెంట్రుకలను శీతాకాలంలో కత్తిరించకూడదు.
  {పతి రోజు పశువులశాలను రెండు సార్లు శుభ్రం చేయాలి. సోడా కార్బోనేట్, 4 శాతం బ్లీచింగ్ పౌడర్ వంటి క్రిమిసంహారక మందులతో శుభ్రపరచాలి.
  నీటి తొట్లను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. తరుచూ వాటికి సున్నం వేస్తుంటే పశువులకు కాల్షియం, ఖనిజ లవణాలు లభ్యమవుతాయి. ఫంగస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది.

  పశువులు తాగేందుకు రోజుకు 50-60 లీటర్ల నీరు అవసరం. శీతాకాలంలో 2-3 సార్లు తాగేందుకు నీరందించాలి. తాగేందుకు నీళ్లు పుష్కలంగా అందిస్తే పాల దిగుబడి బాగుంటుంది.
 పాలు పితికే గంట, రెండు గంటల ముందు లేదా పితికిన తర్వాత దాణా ఇవ్వాలి.

మరిన్ని వార్తలు