ముంగిలి

14 Jan, 2015 23:04 IST|Sakshi
ముంగిలి

సలసల మరిగే నీటి ప్రవాహాల వెల్లవలూ, అలలూ ఒడ్డును కప్పేస్తూ వెనక్కు తగ్గుతూవుండే తావుల్లో మొట్టమొదటి ప్రాణి తన జీవితాన్ని ప్రారంభించింది అనే విషయంలో శాస్త్రజ్ఞులందరూ ఏకీభవిస్తున్నారు.
 రచన: ఎం.వి.రమణారెడ్డి
 
టూకీగా ప్రపంచ చరిత్ర
 
పొట్టలో ఎన్ని ప్రొటాన్లు ఉంటాయో అదే ఆ అణువుకు కేటాయించబడే సంఖ్య. ఉదాహరణకు హైడ్రోజన్ అణువులో ఉండేది ఒకేవొక్క ప్రొటాన్. అందువల్ల దాని అణుసంఖ్య ‘1’ అన్నారు. ఆ తరువాతిది ‘హీలియం’ అనే మరో వాయువు. అందులో వుండే ప్రొటాన్లు రెండు. అందువల్ల దాని అణుసంఖ్య ‘2’ అయింది. ఇలా మూలకంలోని ప్రొటాన్ల సంఖ్య పెరిగేకొద్దీ అణుసంఖ్య దానికి అనుగుణంగా పెరుగుతూపోతుంది. స్థిరమైన మూలకంలో ప్రొటాన్ల సంఖ్య ఎంత వుంటుందో ఎలెక్ట్రాన్ల సంఖ్య అంతే ఉంటుంది. ఇలాంటి మూలకాలు విడివిడిగా ఉండడమేగాక, రెండో మూడో మరిన్నో కలిసి, ఒకటిగా సంయోగం చెందడంతో, మట్టితో సహా మరెన్నో పదార్థాలు తయారై, వైవిధ్యం కలిగిన ఈ ప్రపంచాన్ని సృష్టించాయి. ఆ విధంగా పంచభూతాత్మకమైన ఈ భూమి మీద ఒకానొకప్పటికి ఏర్పడిన పదార్థాల్లో దేనికీ కొదవలేదు - ఒక్క జీవపదార్థానికి తప్ప; పాలసముద్రాన్ని చిలికితే అమృతానికి ముందుగా ఏవేవో పదార్థాలు పుట్టుకొచ్చాయని చెబుతుంటారే అలా జరిగింది అప్పట్లో!

భూగోళం నిప్పులకొలిమిగా ఉన్న రోజుల్లో, పదార్థాలన్నీ ద్రవంగానో వాయువుగానో ఉండక తప్పని పరిస్థితి. వాయువులకంటే ద్రవాలు చిక్కగా తూకంగా ఉంటాయి గాబట్టి... బరువుగా వుండేవి అడుగుకూ- అంటే భూమి గర్భంవైపునకూ, తేలికైనవి పైకీ- అంటే ఉపరితలానికీ సర్దుకున్నాయి. మరింత చల్లబడిన తరువాత కొన్ని ద్రవాలు గడ్డకట్టడం మొదలెట్టాయి. మరుగుతున్న చిక్కని పదార్థం పేరు ‘లావా’. దాని మీద తెట్టెలా తేలాడే ఘనపదార్థం రాబోయే కాలానికి రూపుదిద్దుకుంటున్న ‘నేల’.

గడ్డకట్టడం, కరిగిపోవడం, ఉష్ణోగ్రత తగ్గిన వేళల్లో తిరిగి గడ్డకట్టడం మళ్ళీ కరిగిపోవడం జరుగగా జరుగగా, కొన్ని కోట్ల సంవత్సరాలకు ఆ తెట్టె మందం పెరిగి, ఎట్టకేలకు పల్చటి బొప్పిలా భూగోళాన్ని కప్పేసింది. ఈ బొప్పి మందం ఇప్పటికిగూడా 20 మైళ్ళకు మించదు. లోతైన సముద్రాల్లో మరీ పల్చన - రెండున్నర మూడు మైళ్ళు మాత్రమే ఉంటుంది. నాలుగు వేల మైళ్ళుగా ఉండే భూమి వ్యాసార్థంతో పోలిస్తే ఇది యాపిల్‌పండు మీది తొక్కతో సమానం. అప్పుడప్పుడు ఈ తొక్కను తొలుచుకుని లావా బయటికి ఎగజిమ్మడం ఇప్పటికీ వింటూనేవున్నాం. అలా ఏర్పడిన పొక్కును ‘అగ్ని పర్వతం’ అంటుంటాం. ఒక్కోసారి, బయటికి చిమ్మకుండా గర్భంలోనే కుతకుతలాడే లావా ప్రవాహం దురుసుకు నేల పొరులు బలహీనంగావున్న తావుల్లో, ఒత్తిడికి తట్టుకోలేక పొంతన తప్పే పలకచెక్కల్లా ఎగుడుదిగుడైనప్పుడు సంభవించే ఉపద్రవాన్ని ‘భూకంపం’ అంటుంటాం.

నేలగా ఏర్పడిన బొప్పి యాపిల్‌పండు తొక్కలాంటిదని అనుకున్నామా ఇంతదాకా- అది కేవలం మందానికి సంబంధించిన పోలికే. ఆకారంలో మాత్రం క్రమాన్ని పాటించని మిట్టలూ పల్లాలతో గతుకులు గతుకులుగా ఉంటుంది. బాగా ఎత్తై మిట్టలు పర్వతాలు; బాగా లోతుండే పల్లాలు సముద్రాలు. వర్షాలు కురిస్తే ఆ వాననీళ్ళు మిట్టల మీదినుండి చదునుకు జారి పల్లాలకు ప్రవహిస్తాయి. ఆ వెల్లువలు నేలను కోసుకుంటూ జాడలు చేసుకున్న గాయాలే వంకలూ, వాగులూ, నదీనదాలూ.

మరో యాభైకోట్ల సంవత్సరాల పొడవున జరిగిన పరిణామక్రమంలో, ఆయా వాతావరణ స్థితిగతుల్లో, పలురకాల మూలకాల సంయోగంతో ఎడతెరపి లేకుండా ఎన్నోరకాల పదార్థాలు ఏర్పడుతూవచ్చాయి. అలా ఏర్పడిన వాటిల్లో చిత్రాతి చిత్రమైన పదార్థం ‘క్రోమొజోమ్’. దాని భౌతిక లక్షణాల సముదాయమే ‘ప్రాణం’. ప్రాణమున్న పదార్థం పేరు ‘ప్రాణి లేదా జీవి’. ఇంతవరకు భూమిమీద ఏర్పడిన రసాయనిక సంయోగాలన్నిటిలో అత్యంత క్లిష్టమైన సంయోగం ‘ప్రాణం’. ఇది ఊపిరి పీలుస్తుంది, ఆహారం భోంచేస్తుంది, తనకు తానుగా స్థానం మార్చుకుంటుంది, తనబోటి జీవులను సంతానంగా కంటుంది. దీని సృష్టికి అవసరమైన మూలకాలు యావత్తు భూమిమీద ఇప్పటికీ లభ్యమైనా, ఆ తరహా సంయోగానికి వీలయ్యే భౌతిక పరిస్థితులు మాత్రం ఇప్పుడు లేవు.

సలసల మరిగే నీటి ప్రవాహాల వెల్లవలూ, అలలూ ఒడ్డును కప్పేస్తూ వెనక్కు తగ్గుతూవుండే తావుల్లో మొట్టమొదటి ప్రాణి తన జీవితాన్ని ప్రారంభించింది అనే విషయంలో శాస్త్రజ్ఞులందరూ ఏకీభవిస్తున్నారు. అప్పట్లో అల్లకల్లోలంగావున్న ఇలాతల ఉపరితల ఉపద్రవాలను ఎదుర్కుంటూ అది అనేకసార్లు పుట్టనూ పుట్టేది, గిట్టనూ గిట్టేది. చివరకు, ఆత్మరక్షణ కోసం తన చుట్టూ దళసరి పొరను తయారుజేసుకోవడంలో సాఫల్యం సాధించి, అటుపోట్లను తట్టుకుని, నీటిని ఆశ్రయించి, అది తన ఉనికిని సుస్థిరం చేసుకోగలిగింది.
 ‘జీవి ఎలా తయారైంది?’ అని ఎవరైనా అడిగితే ఒకప్పుడు సమాధానం చెప్పడం కష్టంగా ఉండేది. కొన్నేళ్ళ తరువాత సమాధానం దొరికినా, దాంతో వినేవాళ్ళను నమ్మించడం అసాధ్యంగా ఉండేది. హరగోవింద్ ఖొరానా అనే ‘నాన్ రెసిడెన్షియల్’ భారతీయ శాస్త్రజ్ఞుడు జీవపదార్థాన్ని ల్యాబొరేటరీలో కృత్రిమంగా తయారుజేసి అపరబ్రహ్మ కావడంతో బుల్లిబుల్లి సందేహాలు శాశ్వతంగా అంతరించాయి.

మరిన్ని వార్తలు