బజారుపాలవుతున్న భారతం

31 Jan, 2017 07:15 IST|Sakshi
బజారుపాలవుతున్న భారతం

రెండో మాట
‘తెలుగుదేశం–బీజేపీ’ ప్రభుత్వం కుదుర్చుకుంటున్న కాంట్రాక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరువును ఏ స్థాయిలో ఎండగడుతున్నాయో మకీ సంస్థ ప్రకటనతో వెల్లడైంది. ‘పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం’ ఈ పని చేశారని మర్యాద పూర్వకంగా ‘మకీ’ హెచ్చరించింది. ‘ఏపీ సర్కారు తీరు దేశ ప్రతిష్ఠకే విఘాతం కల్గించిందని’ కూడా విమర్శించింది. బిడ్డింగ్‌లో ఆఖరి జాబితాలో ఆఖరివాళ్లుగా ఉన్న ‘పోస్టర్‌ కాంట్రాక్టర్, హఫీజ్‌ కాంట్రాక్టర్లను రహ స్యంగా ఎంపిక చేసి, ప్రపంచ ప్రసిద్ధి చెందిన తమను తప్పించారని మకీ వెల్లడించింది.

‘అవినీతి అంటే మనకు కంపరం పుడుతోంది. అందుకే మనం దేశంలో మార్పును కోరుకుంటున్నాం. కానీ మనం ఆశిస్తున్న ఆ మార్పు ఆకర్షణీయంగా లేదు. నోట్ల రద్దులో చిత్తశుద్ధి లేదు. నల్లధనమంతా విదేశాలలోనే పోగుపడి ఉంది. నాయకులలో అభద్రతాభావం వల్ల వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. దేశాన్ని పాలించే వారిని ఎన్నుకోవడం దగ్గర ఇక జాగ్రత్తగా ఉండాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. పొగిడే పని ఇతరులకు కూడా ఇవ్వకుండా తనను తానే పొగుడుకునే వాడు, తన సామర్థ్యం గురించీ, రూపాన్ని గురించీ తనకు తానే కీర్తించుకునే నాయకులున్నచోట మనం జాగ్రత్తగా ఉండాలి.’
– అరుణ్‌శౌరీ (హైదరాబాద్‌ సాహిత్య సమ్మేళనంలో. 28–1–2017)


‘దేశంలో నన్ను మించిన సీనియర్‌ నాయకుడు ఎవరూ లేరు. నా పార్టీ ఎంపీల బలంతోనే వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పడింది. ప్రధాని దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా అందరినీ నేనే ఎంపిక చేసేవాడిని. విదేశాల్లో నాకు ఎంత బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగిందో అర్థం చేసుకోవాలి. అసలు ప్రపంచం మొత్తాన్ని అనుసంధానిస్తే దావోస్‌నే ఇక్కడికి తీసుకొస్తా.’
– ఏపీ సీఎం చంద్రబాబు (విశాఖ సీఐఐ శిఖరాగ్ర సభ సందర్భంగా విలేకరుల సమావేశంలో, 28–1–2017)


మన కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలలో ఉన్న గాడి తప్పిన పాలకుల గురించి ప్రఖ్యాత పత్రికా రచయిత అరుణ్‌ శౌరీ బాహాటంగానూ, నర్మగర్భంగానూ ప్రస్తావించిన అంశాలు, చేసిన విమర్శలు ప్రధాని నరేంద్ర మోదీకీ, ఇతరులకీ కూడా వర్తిస్తాయి. దేశంలో మార్పు రావాలని మనం కోరుకుంటున్నాం. కానీ ఆ మార్పు ఎంతమాత్రం సానుకూలంగా లేదని శౌరీ వ్యాఖ్య. ఈ ప్రస్తావనలో ముసోలినీ (ఇటలీ నియంత), నియంతల తీరును మరపించిన ఇందిరా గాంధీలతో పాటు నేటి ప్రధాని మోదీనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నూ ఆయన పరోక్షంగా పేర్కొనడం విశేషం. అంతేకాదు, ‘మార్పు కోసం దేశ యువశక్తి జరిపే సబబైన పోరాటం కోసం నేను ఎదురు చూస్తు న్నా’నని కూడా అన్నారు.

రెండు వికృతులు, రెండు గ్రంథాలు
గతంలో బీజేపీ మంత్రివర్గంలో పనిచేసిన శౌరీ ఆ విధానాలతో విసిగిపోయి వేరయ్యారు. ఆయన మాటల్లోని సారాన్ని మాత్రం గ్రహించాలి. శౌరీ విమర్శలకు బలం చేకూరుస్తూ ‘ది హిందు’ పత్రికా రచయిత, గ్రంథకర్త జోసీ జోసఫ్‌ హైదరాబాద్‌ సాహిత్య సమ్మేళనంలోనే ప్రసంగించారు. ‘దేశంలో ఇవాళ అన్ని రంగాలలోను దళారీ వ్యవస్థ పాతుకుపోయింది. న్యాయ వ్యవస్థ సహా రాజకీయ, ఆర్థిక, వ్యాపార రంగాల వరకు దేశాన్ని అమ్మకానికి పెట్టేందుకు కూడా ఈ దళారీ వ్యవస్థ సిద్ధంగా ఉంది. ఒక మాఫియాలా మారిన రాజకీయ రంగం దళారులపైనే ఆధారపడి పాలనను నిర్వహిస్తున్నది’ అని జోసఫ్‌ విశ్లేషించవలసి వచ్చింది. ఏడు పదుల స్వాతంత్య్రం తరువాత కూడా ఇదీ ఈ  దేశం పరిస్థితి.

ఈ స్వదేశీ, విదేశీ దళారీ వ్యవస్థల మూలంగా మన వ్యవస్థలకు పట్టిన పీడ, చీడ ఇంతగా విస్తరించడానికి కారణం–1991లో ప్రపంచ బ్యాంక్‌ సంస్కరణలను పాలకులు బేషరతుగా అమలులోకి తేవడమే. ఇదే అంశాన్ని ఇటీవల కాలంలో రెండు గ్రంథాలు బహిర్గతం చేశాయి. వాటిలో మొదటిది– ‘ఇండియా ఈజ్‌ ఫర్‌ సేల్‌’ (అమ్మకానికి భారతదేశం). బొఫోర్స్‌ ట్యాంకుల కుంభకోణాలను వెల్లడిస్తూ, వాటి గురించి వ్యాఖ్యానిస్తూ చిత్రా సుబ్ర హ్మణ్యం రాసిన పుస్తకమిది. రెండు–‘ఇండియా ఈజ్‌ ఆన్‌ సేల్‌’. జోసఫ్‌ తాజాగా రాసిన గ్రంథమిది. హైదరాబాద్‌ సాహిత్య సమ్మేళనంలో ఆవిష్కరించారు.

ప్రపంచ బ్యాంక్‌ ఆశీస్సులతో తుచ తప్పకుండా ఒంట బట్టించు కుని రాముడు మంచి బాలుడు అన్న తీరులో వాటిని పాటిస్తున్న మహానేతలు మోదీ, చంద్రబాబుల విధానాలే ఈ రెండు గ్రంథాల సారం. నిజానికి ఆ ఇద్దరిదీ గుజరాత్‌ నమూనాయే. అయితే ఒకరిది (బాబు) దావోస్‌ మార్గం ద్వారా వయా ప్రపంచ బ్యాంక్‌ దోపిడీ అమలు జరుపుతుంది. మరొకరిది (మోదీ) ‘భారతదేశంలోనే తయారీ’ (మేక్‌ ఇన్‌ ఇండియా) నినాదం చాటున విదేశీ గుత్త సంస్థలే వస్తూత్పత్తి లేదా సరుకులను ఇండియాలో తయారు చేసి పెట్టే వ్యూహం. అంటే రాయి ఏదైనా ఊడగొట్టేది మన పళ్లనే.

బాదరాయణ బంధం
ప్రపంచ బ్యాంక్, (+ఐఎంఎఫ్‌) సంస్కరణల ఉద్దేశం ఏమిటి? ప్రపంచ కుబే రులను ఏటా దావోస్‌ శీతల డోలికల్లో సమావేశపరచం ఎందుకు? కేవలం పెట్టుబడిదారీ వ్యవస్థల వ్యాపార, వాణిజ్య సుస్థిరతల కోసమేగానీ ఇండియా, ఆసియా–ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా వర్ధమాన, బడుగు దేశాల ఆర్థిక స్వాతంత్య్రాన్ని సుస్థిరం చేయడానికి కాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం రిపబ్లికన్‌–డెమోక్రాటిక్‌ పార్టీల నాయకులు ఎలాంటి ఎత్తులు వేస్తారో, ఇండియా లాంటి వర్ధమాన దేశాల పాలకులు కూడా వాటికే అలవాటుపడ్డారు. చిత్రా సుబ్రహ్మణ్యం గ్రంథంలో ముందస్తు హెచ్చరికలు చేయడం ఈ నేపథ్యంతోనే: ‘పశ్చిమ దేశాలకు మన వస్త్ర పరిశ్రమ ఉత్ప త్తులను (టెక్స్‌టైల్స్‌) వారి నిర్బంధాలవల్ల ఎగుమతి చేయలేకపోతున్న సమ యంలో కాలిఫోర్నియా (అమెరికా) నుంచి బాదంను దిగుమతి చేసుకుంటున్నాం.

మనం ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి చేసుకోగల బాదంపప్పును ఎందుకు దిగుమతి చేసుకోవాలో ఏ  ఆర్థికమంత్రిగానీ, వాణిజ్య శాఖ మంత్రి గానీ ఏనాడూ వివరించలేదు. ఒక మంత్రి మాత్రం ఆల్మండ్‌ దిగుమతులకు కారణాల్ని వివరించలేనంటూనే అసలు విషయాన్ని బయటపెట్టాడు: ‘అవును, రోనాల్డ్‌ రీగన్‌ (అమెరికా అధ్యక్షుడు) ఎన్నికల్లో గెలవాలి కాబట్టి అమెరికా బాదం ఎగుమతుల్ని ఇండియా దిగుమతి చేసుకుని తీరాలి. అమె రికా అధ్యక్ష ఎన్నికలకు, ఇండియాకు, బాదం ఎగుమతులకు లంకేమిటి? ఆ గుట్టు మీకు తెలియదు, తెలివిగల మేధావి కూడా అర్థం చేసుకోలేడు. ఆ రహస్యం అమెరికా, యూరప్‌ పాలకుల ప్రీత్యర్థం వారిని బుజ్జగించేందుకు తహతహలాడే కొలదిమంది అధికారుల రహస్య ఒప్పందాలకే పరిమితం. అంతే, దాంతో ప్రపంచబ్యాంకు దాని అనుబంధ సంస్థలుగా వర్ధిల్లుతున్న ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ (పాత గ్యాట్‌ సంస్థ) నుంచి న్యూఢిల్లీకి ఒక్క టెలిఫోన్‌ కాల్‌ వస్తే చాలు ఢిల్లీ పాలకులు గజగజలాడుతూ ఆ ఆదేశాలు పాటించడం పరిపాటి.

ఈ మంతనాలన్నీ ఇండియాను సంతలో అమ్మకానికి పెట్టడం కోసమే, భారత సంపదను కాస్తా ఊడ్చి పెట్టడానికే’ (చిత్ర పుస్తకం– పే. 105–106). ఇప్పుడీ వరసలోనే కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ అధినేత దావోస్‌ ‘ప్రపంచ ఆర్థిక సదస్సు’కు చంద్రబాబు వెంట వెళ్లి తిరిగొచ్చి చేసిన పని, అదే సీఐఐ అధినేత ఆధ్వర్యంలో మళ్లీ ‘అవగాహన పత్రాల’ పేరుతో రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడమే. ముందు ప్రైవేట్‌ పారిశ్రామికవేత్తలతో రూ. 5,000 కోట్ల పెట్టబడులకు ‘అవగాహన’ ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చు కున్నారేగానీ, అవేవీ ఆచరణలో ప్రతిఫలించలేదు. అయితే ‘ప్రతిపాదిత 80 పరిశ్రమలు కార్యరూపం దాలిస్తే’ మరో రూ. 15 వేల కోట్ల ఒప్పందాలు ఖరా రయ్యే ‘అవకాశం’ ఉందట. అంటే ఏదీ ‘కార్యరూపం’ దాల్చకుండానే చంద్ర బాబు రాజధాని ముసుగులో ఆశల పల్లకీమీద ప్రజల్ని ఎక్కించే చిట్కాలు కనిపెడుతున్నారు.

ప్రపంచీకరణ మాటున అసమానత
సరిగ్గా ఈ సమయంలోనే రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ ప్రసిద్ధ వాస్తు శిల్ప నిర్మాణ సంస్థ ‘మకీ అండ్‌ అసోసియేట్స్‌’(జపాన్‌)తో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఎలాంటి వివరణ, నోటీసు లేకుండానే అర్ధాంత రంగా చంద్రబాబు రద్దు చేశారు. చివరికి దీనిని పర్యవేక్షిస్తున్న కేంద్రీయ సంస్థకు కూడా తెలియకుండా కాంట్రాక్టును రద్దు చేసినట్టు మకీ అసోసి యేట్స్‌ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘తెలుగుదేశం–బీజేపీ’ ప్రభుత్వం కుదుర్చుకుంటున్న కాంట్రాక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరు వును ఏ స్థాయిలో ఎండగడుతున్నాయో మకీ సంస్థ ఆకస్మిక ప్రకటనతో వెల్లడైంది. ‘పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం’ ఈ పని చేశారని మర్యాద పూర్వకంగా ‘మకీ’ హెచ్చరించింది. ‘ఏపీ సర్కారు తీరు దేశ ప్రతిష్ఠకే విఘాతం కల్గించిందని’ కూడా విమర్శించింది. బిడ్డింగ్‌లో ఆఖరి జాబితాలో ఆఖరివాళ్లుగా ఉన్న ‘పోస్టర్‌ కాంట్రాక్టర్‌ (లండన్‌), హఫీజ్‌ కాంట్రాక్టర్లను రహస్యంగా ఎంపిక చేసి, ఖరారైన పనులు అప్పగించే సమయానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన తమ సంస్థను తప్పించారని మకీ వెల్లడించింది.

నిజానికి సమాచార మాధ్యమాల అధ్యయనాలను చూసినా, ఏ ప్రతిష్టా త్మక సంస్థల అంచనాలను చూసినా– అమరావతి రాజధాని కాంట్రాక్టు సహా మొత్తం 40 ప్రాజెక్టులకు నిర్మాణ సారథ్యం వహిస్తున్న ‘మకీ’ సంస్థ 17 అంత    ర్జాతీయ పురస్కారాలు అందుకుంది. మన్హాటన్‌ (అమెరికా)లో 33 కోట్ల డాల ర్లతో ఐక్యరాజ్య సమితి తలపెట్టిన విస్తరణ విభాగాన్ని నిర్మించి కితాబులందు కున్న సంస్థ ‘మకీ’. పునర్జన్మ పొందిన ప్రపంచ వాణిజ్య సముదాయం ‘టవర్‌–4’ నిర్మాతలు మకీ అసోసియేట్స్‌. అన్నింటికన్నా విశేషం–బీజేపీ పాలిత రాష్ట్రమైన ‘మధ్యప్రదేశ్‌ మోడల్‌’ను ప్రతివారూ ఆదర్శంగా తీసుకో వాలని పెట్టుబడిదారీ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు సీఐఐ సంచాల కుడు చంద్రజిత్‌ బెనర్జీ ప్రచారం చేశాడు. ఈ చర్యతో అతడు మోదీ ప్రచారకర్త అని సదస్సులో కొందరు భావించడం కొసమెరుపు.

‘వ్యాపార సంస్కృతిని సుకరం (ఈజ్‌ ఆఫ్‌ బిజినెస్‌) చేయడం’ లేదా వ్యాపారాభివృద్ధిని సానుకూలం చేయడం, లేదా ఇండియాలోనే విదేశీ కంపె నీలొచ్చి వస్తూత్పత్తి కార్య క్రమాలు నిర్వర్తించి పెట్టడం అనే సరికొత్త వ్యాపార నినాదాలు ఏమైనా– ఆధునిక పరిభాషలో ప్రభుత్వ రంగాన్ని కూల్చి ప్రైవేట్‌ రంగం లాభాలకు మార్గనిర్దేశాలుగానే భావించాలి. కరెన్సీ విలువల్ని తారు మారు చేసి ఆసియా సంక్షోభాలకు కారకుడైన జార్జి సోరెజ్‌ సహితం ‘గ్లోబ లైజేషన్‌ ద్వారా జరిగిన పని–ప్రైవేట్‌ ఉత్పత్తి సరకులకూ, పబ్లిక్‌రంగ ఉత్పత్తి అవకా శాల మధ్య వనరుల పంపిణీలో అస్తవ్యస్త వ్యవస్థకూ దారితీయడం. మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ సంపదను సృష్టించవచ్చుగానీ, సమాజ అవసరాల గురించి అది పట్టించుకో’దని చెప్పాడు. అందుకే వరల్డ్‌ బ్యాంక్‌ మాజీ అధి పతి సిగిజ్‌ కూడా, ‘గ్లోబలైజేషన్‌ వల్ల ప్రపంచంలో అసమానత్వం పెచ్చరిల్లి పోతుంది!’ అన్నాడు.


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు