మల్లన్నసాగర్‌పై మరో కుట్ర

12 Jul, 2017 04:34 IST|Sakshi
మల్లన్నసాగర్‌పై మరో కుట్ర

సందర్భం
డ్యాంలని నదికి అడ్డంగా నిర్మించాలే తప్ప నది లేనిచోట నిర్మించిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవంటున్నారు మల్లన్నసాగర్‌ విమర్శకులు. రాయలసీమలో నదిలేనిచోట వాగులపై ఎక్కువ నిల్వ సామర్థ్యంతో కట్టిన జలాశయాల మాటేంటి?

టీజేఏసీ వారు కొన్ని నెలల క్రితం ‘‘ కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరి గేషన్‌ ప్రాజెక్ట్‌ – విల్‌ ఇట్‌ బెనిఫిట్‌ తెలంగాణ?’’ పేరుతో విడుదల చేసిన నివేదికలో మల్లన్నసాగర్‌ జలాశయం ప్రాంతంలో పగుళ్ల గురించి ప్రస్తావించి ఉన్నారు. వాటిని తిరిగి ఇటీవల కోదండరాం చర్చకు తీసుకు వచ్చినారు. పగుళ్ళు ఉన్న ప్రాంతంలో 50 టీఎంసీ జలాశయాన్ని ఎట్లా నిర్మిస్తారని ప్రశ్నిస్తు న్నారు. పగుళ్లపై సమగ్ర అధ్యయనం జరపాలని, అంత వరకు ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలవద్దని, భూసేక రణ చెయ్యవద్దని అంటున్నారు. ఆయన ప్రకటనలని జేఏసీ సభ్యులు కొందరు ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌ గ్రూపుల్లో విస్తృతంగా చర్చిస్తున్నారు.

పైన పేర్కొన్న  నివేదికలో రచయితలు చేసిన వాదన ఏమిటంటే... సాధారణంగా డ్యాంలని నదీ ప్రవాహానికి అడ్డంగా నిర్మిస్తారు. కానీ ఇక్కడ మాత్రం కూడెల్లి వాగుకు సమాం తరంగా నిర్మిస్తున్నారు. దీని వలన మట్టి కట్ట నుంచి ఎక్కువ నీరు బయటకు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి బురద భూమిగా మారుతుంది. మల్లన్నసాగర్‌ డ్యాం నిర్మిస్తున్న ప్రాంతంలో భూగర్భంలో డ్యాంకు సమాంతరంగా పగుళ్ళు కనిపిస్తున్నాయి. డ్యాంలో 40– 60 మీటర్ల ఎత్తులో నీరు నిలిచి ఉంటుంది కనుక ఈ నీటి బరువుకి భూగర్భంలో ఉన్న పగుళ్ళు మరింత వెడల్పు అయి ఎక్కువ నీరు బయటకు పోతుంది. దీంతో  మట్టి కట్ట క్రమేణా కొట్టుకుపోయి లక్షలాదిమంది ప్రజలు ఆస్తి, ప్రాణ నష్టానికి గురి అవుతారు. అందుకని డ్యాం నిర్మాణ స్థలంపై మరింత పరిశోధన అవసరం.

రచయితలు ఈ రకమైన నిర్ధారణకు ఏ భూ భౌతిక పరిశోధనల ఆధారంగా వచ్చినారో ఎక్కడా పేర్కొన లేదు. ఇది కూడా వారి ఊహాగానమే తప్ప శాస్త్రీయ పరిశోధనపై ఆధారపడి చేసిన నిర్ధారణ కాదు. వారు చెప్పినట్లు కూడెల్లి వాగు మల్లన్నసాగర్‌ డ్యాంకు బయట నుంచి సాగిపోతున్నది. డ్యాంలైన్‌కి అతి దగ్గరగా ఉన్న ప్పుడు దూరం 300 మీటర్లు ఉంటుంది. అదికూడా 34 కి.మీ పొడవున ప్రవహించే కూడెల్లి వాగుకు ఈ స్థితి 5 కి.మీ మాత్రమే ఉంటుంది. దీనివలన మల్లన్నసాగర్‌ డ్యాంకు ఏ ప్రమాదమూ లేదు. డ్యాంని డిజైన్‌ చేసేట ప్పుడు నీటి ఒత్తిడితో పాటు భూకంపాల నుండి విడు దల అయ్యే శక్తిని కూడా పరిగణిస్తారు. డ్యాం నిర్మిం చేటప్పుడు పునాది తవ్వుతారు. సమగ్రమైన భూభౌతిక పరిశోధనల అనంతరం సీఓటీ ఎంత లోతుకు తవ్వాలో నిర్ధారిస్తారు. తవ్విన పునాదిలో నీటిని అతి తక్కువగా పీల్చుకునే గుణం కలిగిన మట్టినే నింపుతారు.

మల్లన్నసాగర్‌ ముంపు ప్రాంతం మధ్యలో ఉన్న వేములఘాట్‌ గ్రామంలో ఉన్న కోమటి చెరువు, దాని కింద ఉన్న నల్ల చెరువులో ఈ పగుళ్ళ కారణంగా పెద్ద ఎత్తున నీరు బయటకు పోయి చెరువుల్లో నీటి నిల్వ వేగంగా తగ్గిపోయిన అనుభవాలు గతంలో ఎప్పుడూ  లేవు. కాబట్టి ఇది ఊహాగానమే, కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్‌ చేత రికన్నాయిజన్స్‌ సర్వే, లైడార్‌ సర్వే నిర్వహించింది ప్రభుత్వం. వారి సర్వేలో ఎక్కడా జలా శయం ప్రాంతంలో గాని, కూడెల్లి వాగు పరీవాహక ప్రాంతంలో గానీ పగుళ్ళు ఉన్నట్టు తేలలేదు.

ఇక దేశంలో భూకంపాల చరిత్రను పరిశీలిస్తే తెలం గాణలో భూకంపాలు వచ్చిన దాఖలాలు లేవు.

భూకంపాలని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు దేశాన్ని మొత్తం 5 జోన్లుగా వర్గీకరించినారు. దక్కన్‌ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశాలు లేనందున ఈ ప్రాంతాన్ని భూకంప ప్రాంతాల వర్గీకరణ చేసిన ప్పుడు అతి తక్కువ అవకాశాలు ఉన్న జోన్‌ 1,2, 3లో చేర్చినారు.అందులో 80% తెలంగాణ జోన్‌ 1,2లో ఉంటే 20% జోన్‌ 3లో ఉన్నది. అత్యధిక భూకంపాలు సంభవించే అవకాశాలు జోన్‌ 4, 5లోనే ఉన్నాయి. ఇక మల్లన్నసాగర్‌ నిర్మించబోతున్న మెదక్‌ జిల్లా జోన్‌ 2లో ఉన్నదన్న సంగతి ప్రజలు గమనించాలి.

డ్యాంలని నదికి అడ్డంగా నిర్మించాలే తప్ప ఈ రకంగా నది లేనిచోట నిర్మించిన దాఖలాలు దేశంలో  ఎక్కడా లేవు అంటున్నారు మల్లన్నసాగర్‌ విమర్శకులు. ఎక్కడో ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే నది లేని చోట, లేదా చిన్నవాగులపై అవి సమకూర్చే నీటి పరిమాణం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నిల్వ సామ ర్థ్యంతో నిర్మించిన జలాశయాలు రాయలసీమలో ఉన్నాయి. బ్రహ్మంగారి మఠం జలాశయం ఆ కోవలో నిదే. వాటి వివరాలు చూడండి. కండలేరు–68 టీఎం సీలు, గోరకల్లు–10 టీఎంసీలు, వెలిగొండ–41 టీఎం సీలు, వెలుగోడు–17 టీఎంసీలు, బ్రహ్మంగారి మఠం– 17 టీఎంసీలు, అవుకు–7 టీఎంసీలు, అలుగునూరు–3 టీఎంసీలు.

ఇవన్నీ నదులు లేని చోట నిర్మించినవి కావా? అవ సరమైతే కృత్రిమ జలాశయాలు నిర్మించుకోవాలంటూ కేంద్ర జల కమిషన్‌ (సీడబ్ల్యూసీ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. ఎత్తిపోతల పథకాలలో పెద్ద జలాశ యాల నిర్మాణం అత్యంత అవసరం. సీడబ్ల్యూసీ సూచ నల మేరకే 50 టీఎంసీలతో రీ డిజైన్‌ చేయడం తప్ప నిసరైంది. నది లేని చోట డ్యాం నిర్మిస్తున్నారని విమర్శి స్తున్న వారు.. పైన పేర్కొన్న జలాశయాలు నిర్మిస్తున్న ప్పుడు కిక్కురుమనలేదెందుకు? ఇప్పుడు అటువంటిదే మల్లన్నసాగర్‌ జలాశయం నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభు త్వం ఏదో నేరం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. తెలం గాణకు జీవధారగా మారనున్న కాళేశ్వరం ప్రాజెక్టుని వరుస కుట్రలతో అడ్డుకునే ప్రయత్నాలను వమ్ము చేసి తెలంగాణని కోటి ఎకరాల మాగాణంగా మార్చే కృషిలో తెలంగాణ ఇంజనీర్లు తమ మేధస్సును, చెమటను ధారపోయడానికి సిద్ధంగా ఉన్నారు.


- శ్రీధర్‌రావు దేశ్‌పాండే

వ్యాసకర్త కో చైర్మన్, తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ

మరిన్ని వార్తలు