విషాద ‘చరిత్ర’

20 Sep, 2017 00:26 IST|Sakshi
విషాద ‘చరిత్ర’

చరిత్రలో, సంస్కృతిలో మనకు నచ్చినవీ, నచ్చనివీ ఉంటాయి. ఆ రెండింటినీ సమానంగా భద్రపరిచి అధ్యయనం చేసి, వాటినుంచి గుణపాఠాలు నేర్చుకునేవారే బంగారు భవిష్యత్తును నిర్మించుకోగలరు. అయితే ఆ భద్రపరిచేవారికీ, ఆ పని కోసం వారిని ఎంపిక చేసినవారికీ చరిత్రపైనా, సంస్కృతిపైనా ఆపేక్ష, గౌరవమూ ఉండాలి. వాటి ప్రాముఖ్యత తెలియాలి. ఆ స్పృహ ఉన్నకొద్దీ పెరగాల్సింది పోయి, అడుగంటుతున్నదని ఇటీవల వెల్లడైన ఉదంతాలు తెలియజెబుతున్నాయి.

అటు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న జాతీయ ప్రాచ్య లిఖిత భాండాగారం(ఎన్‌ఏఐ), ఇటు పుణేలోని జాతీయ చలనచిత్ర భాండాగార సంస్థ(ఎన్‌ఎఫ్‌ఏఐ)లలో వేలాది రికార్డులు, చలనచిత్రాలు ధ్వంసమైన తీరు, ఆచూకీ లేకుండా పోయినతీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. ఎన్‌ఏఐలోని ఒక ఏసీ గదిలో హైదరాబాద్‌ రెసి డెన్సీకి సంబంధించిన అత్యంత విలువైన సంపుటులు నిర్లక్ష్యంగా పడేసి ఉండటాన్ని గమనించానని ఒక సందర్భంలో రచయిత విలియం డార్లింపుల్‌ రాశారు.

కొంతకాలం పోయాక అదే సంపుటుల కోసం వెదికినప్పుడు వాటిలో చాలాభాగం తడిసి సరిచేయలేనంత స్థాయిలో పాడై ఉన్నాయని, మరికొన్ని నాచు పట్టి ఉన్నా యని తెలిపాడు. ప్రాచీన పత్రాలు కావాలని వచ్చేవారికి వెదుకుతున్నామని, కనబడటంలేదని, త్వరలో ఇస్తామన్న సమాధానాలే వస్తున్నాయని పలువురు చెప్పేమాట.

ఎన్‌ఏఐ పరిస్థితే ఇలా ఉన్నదనుకుంటే పుణేలోని ఎన్‌ఎఫ్‌ఏఐ తీరు కూడా ఘోరంగా ఉంటున్నది. అక్కడ విశ్వవిఖ్యాత దర్శకుడు సత్యజిత్‌ రాయ్‌ నిర్మించిన పథేర్‌ పాంచాలీ, గురుదత్‌ ‘కాగజ్‌ కే ఫూల్‌’, అకిరా కురసోవా ‘సెవెన్‌ సమురాయ్‌’, రాజ్‌కపూర్‌ ‘మేరా నామ్‌ జోకర్‌’, ‘ఆవారా’ వంటి అనేకానేక చిత్రాలు గల్లంతయ్యాయి. వీటితోపాటు పలు మూకీ చిత్రాలు, స్వాతం త్య్రానంతరం వివిధ దేశాల నేతల పర్యటనలకు సంబంధించిన విశేషాలతో ఉన్న డాక్యుమెంటరీలు కనబడటం లేదు.

ప్రపంచ సినీ రంగ చరిత్రలో దిగ్గజాలనదగిన పలు విదేశీ చిత్రాల ప్రింట్లను ఎంతో అవసరమని భావించి సేకరించారు. అవి సైతం గల్లంతయ్యాయి. ఆ సంస్థలో మొత్తంగా 51,500 బాక్సుల్లో ఉన్న 9,200 ప్రింట్లు, 1,112 చిత్రాలున్న 4,992 బాక్సులు కనబడటం లేదంటున్నారు. ఇవన్నీ సమాచార హక్కు చట్టం కింద అడిగితే వెల్లడైన వాస్తవాలు. చాలా చిత్రాల రీళ్లు ప్రదర్శించడానికి వీలైన స్థితిలో లేవన్న సమాధానం కూడా వచ్చింది. రెండేళ్లక్రితం తనిఖీ నిర్వహించినప్పుడు 17,595 చిత్రాలు బస్తాల్లో కట్టిపడేసి ఉన్న వైనాన్ని కనుక్కున్నారు.

ఇంకా అన్యాయమైన సంగతేమంటే వీటిలో చాలా బస్తాలను నిరుడు ఫిబ్రవరిలో ఒక గోడౌన్‌ అద్దెకు తీసుకుని అక్కడికి తరలిం చారు. సినిమా రీళ్లను భద్రపరచడం, వాటిని మెరుగైన స్థితికి తీసుకురావడం అనే అంశంపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వ హించడానికి అవసరమైన చోటు కోసం ఈ తరలింపు జరిగిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక ఇలాంటి సమావేశాల నిర్వహణకు అర్ధం, పరమార్ధం ఏము న్నట్టు?  ఫిలిం రీళ్లయినా, ప్రాచీన పత్రాలైనా భద్రంగా ఉండాలంటే అవి తగిన ఉష్ణోగ్రత మధ్య, దుమ్మూ ధూళి సోకని వాతావరణంలో ఉండాలి. లేనట్టయితే వాటికి బూజుపట్టి, ఫంగస్‌ బయల్దేరి పనికిరాకుండా పోతాయి. మన చరిత్రను, సంస్కృతిని ముందు తరాలకు అందజేసే సంపదపై కనీస శ్రద్ధ చూపకపోవడం క్షమార్హం కాని విషయం.

సాధారణ గ్రంథాలయం నిర్వహణకైనా పద్ధతంటూ ఉంటుంది. మన చరిత్రకు రెండు కళ్లుగా ఉండాల్సిన ఈ రెండు సంస్థలూ కనీసం ఆపాటి విధా నాలైనా పాటిస్తున్న దాఖలాలు లేవు. తమ వద్ద ఉన్నవేమిటో తెలియజెప్పే రిజిస్టర్‌లు సరిగా లేవు. ఉండాల్సినవాటిలో కనబడనివి ఏవో, అవి ఆఖరుగా అందజేసిందెవరికో వెల్లడించే వివరాలు లేవు. ‘మొగల్‌–ఏ–ఆజమ్‌’ , ‘బైసికిల్‌ థీవ్స్‌’, ‘గ్రేట్‌ డిక్టేటర్‌’, ‘అర్థ్‌ సత్య’వంటి చిత్రాలు సంస్థలోనే ఉన్నా రికార్డుల్లో వాటి వివరాలెక్కడా లేవు. ఎన్‌ఎఫ్‌ఏఐ ఏదో ఒరగబెడుతున్నని భావించి పలు వురు ఆ సంస్థకు పంపిన చిత్రాల పార్సెళ్లు రైల్వే పార్సిల్‌ కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. భద్రపరచడానికి అర్హమైనవని భావించి లక్షలాది రూపా యలు ఖర్చుచేసి ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేసిన ప్రింట్లు సైతం కొర గాకుండా మిగిలాయి.

కనీసం అవి ఆ వ్యక్తుల దగ్గర ఉన్నా క్షేమంగా ఉండేవి. సినిమాలు మాత్రమే కాదు... పలు చిత్రాల తాలూకు స్క్రిప్టులు, ఛాయాచిత్రాలు, పోస్టర్లు, పాటల పుస్తకాలు, ఆ చిత్రాలపై వివిధ పత్రికల్లో ప్రచురించిన సమీక్షలు వగైరాలన్నీ బస్తాల్లో కటి మూలనపడేశారని, అవన్నీ దుమ్ముకొట్టుకుపోయి క్షీణ ద«శలో ఉన్నాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇవే కాదు... గత పది పదిహేనేళ్లుగా సేకరిస్తున్న పలు చిత్రాల డీవీడీలు కూడా మాయమయ్యాయి.   

మన దేశాన్ని 200 ఏళ్లు పాలించిన బ్రిటిష్‌వారికి ఇక్కడి చరిత్రను భద్ర పరచడంలో ఉన్న శ్రద్ధ కూడా మనకు కరువవుతోంది. ఈస్టిండియా కంపెనీ సమయం నుంచి కీలక ఉత్తర ప్రత్యుత్తరాలను, నివేదికలను ఒక కాపీ లండన్‌లోని గ్రంథాలయానికి పంపించడం వారి సంప్రదాయం. తెలుగు సమాజానికి సంబం ధించి 400 ఏళ్లనాటి చరిత్రను వెల్లడించే అనేకరకాల లిఖిత ప్రతులు, మ్యాప్‌లు ఆ గ్రంథాలయంలో లభ్యమవుతాయి. చరిత్రనూ, సంస్కృతినీ స్వీయ ప్రయోజ నాలకు వక్రీకరించడం తప్ప వర్తమానం కోసం, భవిష్యత్తరాల కోసం వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలన్న స్పృహ పాలకులకు లేకపోవడమే ఈ దుస్థితికి మూలకారణం.

అందువల్లే విలువల్లేనివారు, వారసత్వ సంపద విలువ తెలియని వారు ఆ సంస్థల సారథలవుతున్నారు. తాము నియమిస్తున్నవారికున్న అర్హతలే మిటో, అభిరుచులేమిటో, వారి ఏలుబడిలో సంస్థ భవితవ్యం ఎలా ఉంటుందో ఎవరికీ పట్టడం లేదు. ఇలాంటి దయనీయ స్థితిలో మన కోహినూర్‌ వజ్రం వెనక్కివ్వాలని, మన నెమలి సింహాసనం ఆచూకీ చెప్పాలని, సుల్తాన్‌గంజ్‌ బుద్ధ విగ్రహం అప్పగించాలని అడిగే అర్హత మనకుంటుందా?

మరిన్ని వార్తలు