అమెరికాలో యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్‌కు సన్మానం

26 Apr, 2017 21:27 IST|Sakshi

న్యూయార్క్: డెట్రాయిట్ యూఎస్ఏ స్థానిక ఐలాండ్ లేక్స్ అఫ్ నోవి సమావేశమందిరంలో తెలుగు సాహితీవేత్తలు, అభిమానులు, తెలుగు సంస్థల నాయకుల సమక్షంలో లయోల కళాశాల పూర్వ విద్యార్థులు డా. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ని సన్మానించారు. పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ పూర్వ విద్యార్థి, నాట్స్ నాయకులు శ్రీని కొడాలి నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్ష్మి ప్రసాద్ ని ప్రముఖ వైద్యులు, గుంటూరు ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల అధ్యక్షులు డా. ముక్కామల అప్పారావు సత్కరించారు. పురప్రముఖులు కాట్రగడ్డ నరసింహారావు చేతుల మీదుగా లక్ష్మి ప్రసాద్ కి జ్ఞాపికని అందచేశారు.

డా. ముక్కామల అప్పారావు ప్రసంగిస్తూ.. లక్ష్మి ప్రసాద్ తో తనకున్న మూడు దశాబ్దాల పరిచయం, ఆయన ఒక మామూలు వ్యక్తిగా జీవితం ప్రారంభించి, అకుంఠిత దీక్షతో సాహితీ సేవద్వారా పద్మభూషణుడైన ప్రస్థానాన్ని సభికులకు వివరించారు. నాట్స్ డైరెక్టర్ డా. కొడాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. లక్ష్మి ప్రసాద్ గారి విజయానికి ఆయన సాధించిన అవార్డులు గీటురాయి అన్నారు. తానా మాజీ అధ్యక్షులు డా. బండ్ల హనుమయ్య చౌదరి తన ప్రసంగంలో, లక్ష్మి ప్రసాద్ చేసిన హిందీ, తెలుగు బాషలలో రచనలు వివరిస్తూ వివిధ భాషలపైనా ఆయనకి ఉన్నపట్టుని వివరించారు, బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు .

తానా మాజీ బోర్డు అఫ్ డైరెక్టర్ డా. యడ్ల హేమ ప్రసాద్ జై ఆంధ్ర ఉద్యమంలో తాను చూసిన ఒక యువకుడు నేడు పద్మభూషణుడిగా మన ముందు నిలబడటం కృషితో మనిషి సాధించలేనిది ఏమీ లేదు అన్నది మరొకమారు నిరూపితమైనది అన్నారు. డా. లక్ష్మి ప్రసాద్ తన ప్రసంగంలో తన శిష్యులు ప్రపంచంలో అన్ని దేశాలలో వున్నారు, వారి ప్రగతి ని చూస్తుంటే తనకి చాలా సంతోషంగా ఉంటుంది, జీవితం సార్ధకం అనిపిస్తూ ఉంటుంది అన్నారు. తెలుగులో ఎంతో మంది కవులు, గొప్ప రచయితలు వున్నారు, తనకి దక్కిన ఈ గౌరవం భగవంతుడి వరంలా భావిస్తూ వుంటాను, చివరివరకు తెలుగు భాషకి సేవ చేయాలన్నదే తన అభిమతమని తెలిపారు. నాట్స్ చేస్తున్న ఈ కార్యక్రమాలు వారి 'భాషే రమ్యం, సేవే గమ్యం' ఆశయానికి నిదర్శనం అని కొనియాడారు. డా. రాఘవేంద్ర చౌదరి, నాట్స్ నేషనల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ కృష్ణ కొత్తపల్లి, డీటీఏ అధ్యక్షులు హర్ష, వేణు సురపరాజు, వినోద్ కుకునూర్ తదితరులు ప్రసంగించారు.

డా. సాయి రమేష్ బిక్కిన, డా. సురేష్ అన్నే, డా. సుధ, డా. ఉష , డా. అరుణ బావినేని, డా. సునీల్ కోనేరు, డా. శ్రీదేవి, డా. విజయ, ప్రముఖ నిర్మాత మైత్రి మూవీస్ అధినేత నవీన్ యెర్నేని, ద్వారకా ప్రసాద్ బొప్పన, ప్రసాద్ గొంది, వెంకట్ కొండోజు, సురేష్ పుట్టగుంట, వెంకట్ ఎక్కా, నాని గోనుగుంట్ల, మహీధర్ రెడ్డి , సుధాకర్ కాట్రగడ్డ, శ్రీనివాస్ నిమ్మగడ్డ, సాగర్ మారంరెడ్డి, తానా ఆర్‌వీపీ శివ యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమ వ్యాఖ్యాత గా శివ అడుసుమిల్లి వ్యవహరించారు. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బసవేంద్ర సూరపనేని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన డిట్రాయిట్ నాట్స్ ప్రెసిడెంట్ కిషోర్ తమ్మినీడి, ఆర్‌వీపీ విష్ణు వీరపనేని, వెంకట్ కొడాలి, గౌతమ్ మర్నేని, శ్రీధర్ అట్లూరి, మోహన్ సూరపనేని, రాంప్రసాద్ చిలుకూరి, శ్రీనివాస్ వేమూరిలను అభినందించారు.

మరిన్ని వార్తలు