ముందున్నది మహా కష్ట కాలం

7 Aug, 2016 08:37 IST|Sakshi
ముందున్నది మహా కష్ట కాలం

అవలోకనం
 
 జీఎస్‌టీ తదుపరి ఇంకా ఆశించదగిన మహా విస్ఫోటక ఆర్థిక సంస్కరణలు ఏమీ లేవని ప్రధాని స్పష్టంగా వివరించాలి. రాబోయే పదేళ్లలో ఆరు లేదా ఏడు శాతం వృద్ధి రేటును అధిగమించలేం. కాలం గడిచేకొద్దీ ఈ వృద్ధి రేటును కొనసాగించడం సైతం మరింత కష్టం అవుతుంది. భారీ మార్పులు ఏవీ వచ్చే అవకాశం లేదు కాబట్టి పది శాతం వృద్ధిని ఆశించలేం.
 

బయటి ప్రపంచంలోని ఆర్థిక వృద్ధి పరిస్థితి సైతం మన దేశానికి అనుకూ లంగా లేదు. ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తున్నాయి, చరిత్రలో ఎన్నడూ ఎరుగ నంతగా ఉద్యోగాలు మటుమాయమైపోతున్నాయి. వస్తు తయారీ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుందని మనం చాలా కాలంగానే అంచనా వేస్తున్నాం. ఇప్పుడది జరుగుతోంది. డ బ్బును రుణంగా తీసుకోడానికి అయ్యే వ్యయం కంటే శ్రమకు అయ్యే వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల శ్రమకు ప్రత్యామ్నాయంగా యాంత్రీకరణను చేపడుతున్నారు. ఆటోమేషన్ (యాంత్రీకరణ) సేవారంగంలోని ఉద్యోగాలను సైతం దెబ్బతీస్తోంది.‘‘ఐటీ రంగంలో పెరగాల్సిన ఉద్యోగాలలో  10 శాతం అదృశ్యమౌతాయి. అంటే ఐటీ రంగం ఏటా 2 నుంచి 2.5 లక్షల ఉద్యో గాలను సృష్టించేట్టయితే వాటిలో 25,000 నుంచి 50,000 వరకు ఉద్యోగాలు మాయమౌతాయి’’ అని ఇన్ఫోసిస్ మాజీ డెరైక్టర్ మోహన్ దాస్ పాయ్ అన్నారు.

 దేశంలోని 45 లక్షల మంది ఐటీ రంగ ఉద్యోగులలో 4,50,000 మంది మధ్యస్త స్థాయి మేనేజర్లు. వారి పనిని యాంత్రీకరించడం వల్ల వారిలో సగం మంది (2,25,000) వచ్చే దశాబ్ద కాలంలో ఉద్యోగాలను కోల్పోతారు. ‘‘నేడు చాలా మంది (మధ్యస్త స్థాయి మేనేజర్లు) ఏడాదికి రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వారిలో సగం మంది వచ్చే పదేళ్లలో ఉద్యోగాలను కోల్పోతారు’’ అని పాయ్ చెప్పారు. బెంగళూరు, ముంబై, గుర్‌గావ్, పూణె, హైదరాబాద్ వంటి మన నగరాలకు ఇది చాలా పెద్ద దుర్వార్త. ఈ నగరాల వృద్ధికి సేవారంగ ఉద్యోగాలు వెన్నెముకగా ఉన్నాయి. సేవారంగ ఉద్యోగాల యాంత్రీకరణ అంటే ఈ పనిని ఇక భారత్‌కు పంపరని అర్థం. మన పట్టణ మధ్యతరగతి యువత ఉపాధిని కొనసాగించడానికి మనం కొత్త మార్గాలను కనిపెట్టాల్సిన అవసరం ఉంది. గత రెండు దశాబ్దాలుగా లేని కొత్త సమస్య ఇది. ఇంగ్లిష్ భాష ద్వారా లభించే సేవారంగ ఉద్యోగాలు పేదలు, మధ్యతరగతిలో చేరడానికి ఉన్న తేలిక మార్గం. ప్రవేశస్థాయిలోని ఈ ఉద్యోగాలే మటుమాయం కావడం అంటే సామాజిక గమనశీలత ముగిసిపోవడమే.

 ప్రసుత్తం చిన్న చిన్న నగరాలలో సామాజిక అశాంతి పెరుగుతోంది. గుజరాత్ పాటిదార్ల ఆందోళన, హరియాణా జాట్ల ఆందోళన వంటివి ముందు ముందు తీవ్రతరమౌతాయని భావించాలి. ఈ వాస్తవాలను ఎదుర్కోడానికి ప్రభుత్వం ప్రజలను సంసిద్ధం చేస్తున్నదని నేను అనుకోవడం లేదు. అది చూపుతున్న భవిష్యత్ చిత్రం అసాధారణమైనంతటి ఆశావహమైనదిగా ఉంటోంది. వివిధ సామాజిక అసంతృప్తులను పెంపొందుతున్న ఒక జాతీయ సంక్షోభంగా గాక స్థానికమైనవిగా వివరిస్తున్నారు.

 

గత రెండు దశాబ్దాలలోకెల్లా అత్యంత ముఖ్యమైనదిగా పలువురు భావిస్తున్న ఆర్థిక సంస్కరణ క్రమాన్ని భారత్ ఇప్పుడే ప్రారంభించింది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) దేశంలోని పరోక్ష పన్నుల విధానాన్ని సులభతరం చేస్తుంది. కేవలం ఈ సంస్కరణే దేశ ఆర్థిక వృద్ధి రేటుకు మరో రెండు పాయింట్లను చేర్చగలదని సైతం కొందరు భావిస్తున్నారు. ఇతరులు దాన్ని అంగీకరించకపోవచ్చునేమో గానీ, అందరూ ఈ సంస్కరణ కీలకమైనదని విశ్వసిస్తున్నారు. ఇంకా ఏ సంస్క రణలను ప్రవేశపెడతారని మనం ఆశించవచ్చు? ఎన్నో ఏం లేవు, జీఎస్‌టీ స్థాయి సంస్కరణలు అసలుకే లేవు. నరేంద్ర  మోదీ ప్రభుత్వం నాటకీయమైన మార్పును సాధించే దిశగా పలు చట్టాలను చే స్తుందని ఆశించి ఉంటే... ఆయన ఆ ఆశలను నిలబెట్టలేకపోయారు. పెద్ద సంస్కరణగా ముందుకు తెచ్చిన జీఎస్‌టీ బిల్లు సైతం మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. నిజానికి, ఒక ముఖ్యమంత్రిగా మోదీ దాన్ని వ్యతిరేకించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాక ఆయన తన వైఖ రిని మార్చుకున్నారు. ఇది చాలా మంచి, తెలివైన రాజకీయమని అనుకుంటాను.
 
కొంత  కాలం క్రితం ‘వాస్‌స్ట్రీట్ జర్నల్’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మోదీ... చట్టాలు చేయాల్సి ఉన్న పెద్ద సంస్కరణలు ఇంకా ఏమున్నాయో తనకు తెలియ దని అన్నారు. ‘‘నేను ప్రభుత్వంలోకి వచ్చాక నిపుణులందరితో కలసి కూచుని, ‘‘మహా విస్ఫోటనం’’ (భారీ ఆర్థిక సంస్కరణల వెల్లువ) అంటే  వారి దృష్టిలో ఏమిటో నిర్వచించమని కోరేవాడిని. అవేమిటో ఎవ్వరూ చెప్ప గలిగేవారు కారు’’ అని తెలిపారాయన. ఇంకా తేవాల్సి ఉన్న సంస్కరణలలో అత్యధిక భాగం రాష్ట్రా లకు సంబంధించినవ నీ, కీలకమైన, వివాదాస్పదమైన కార్మిక చట్టాలను రాష్ట్రాలు మరింతగా సరళీకరిస్తాయని ఎదురు చూస్తున్నానని  అన్నారు. ‘‘కార్మిక సంస్కరణ లంటే పారిశ్రామికరంగ ప్రయోజనాలేనని అర్థం కాదు. అవి కార్మికుల ప్రయోజ నాల కోసం కూడా ఉద్దేశించినవి’’ అని ఆయన తెలిపారు. మోదీ ఈ విషయంలో చాలా జాగ్రత ్తతో వ్యవహరిస్తున్నారని ఈ మాటలు సూచిస్తున్నాయి.
 
ప్రధాని చెప్పింది పూర్తిగా సరైనదని భావిస్తున్నాను. ఇకనెంత మాత్రమూ సోషలిస్టు దేశంగా లేని దేశంలో ఇంకా తేవాల్సిన మహా సంస్కరణలు ఏము న్నాయి? అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఆర్థిక సరళీకరణకు అనుకూలమైనవే.  పరిస్థితి ఇదైనప్పుడు చట్టపరమైన మార్పులు పెద్దగా జరుగుతాయని ఆశించ జాలం. మన ఆర్థిక వృద్ధిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? మధ్యస్త కాలికంగా, అంటే దాదాపుగా వచ్చే దశాబ్ద కాలంలో ప్రస్తుతం ఉన్న ఆరు లేదా ఏడు శాతం ఆర్థిక వృద్ధి రేటును మనం అధిగమించలేమని నా నమ్మకం. కాలం గడిచేకొద్దీ ఈ వృద్ధి రేటును కొనసాగించడం సైతం మరింత కష్టంగా మారుతుంది. భారీ మార్పులు ఏవీ వచ్చే అవకాశం లేదు కాబట్టి 10 శాతం వృద్ధిని ఆశించలేం. పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయి.


చట్టపరంగా తన ప్రభుత్వం చేయగలగినది ఇంకా ఏమి మిగిలి ఉన్నదనే దాని స్వభావాన్ని మోదీ చక్కగానే వివరిస్తారు. అయితే, ఆశించదగిన మహా విస్ఫోటక ఆర్థిక సంస్కరణలు ఏవీ లేవని, ఏదైనా మార్పంటూ వస్తే అది బహిర్గత పరిస్థితులు భారత్‌పై కలుగజేసేదే కావాలనే విషయాన్ని ఆయన మరింత స్పష్టంగా వివరించాలి.   
 
మన ముందున్నది మహా కష్ట కాలం. అదృష్టవశాత్తూ మనల్ని విశ్వాసంతో ముందుకు తీసుకుపోగల ప్రజామోదం గల ప్రభుత్వమూ ఉంది, ప్రజాదరణ గల నాయకుడూ ఉన్నారు.


 ( వ్యాసకర్త : ఆకార్ పటేల్ కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com )

మరిన్ని వార్తలు