శాస్త్రీయ దృక్పథంతోనే స్వావలంబన

28 Feb, 2016 00:48 IST|Sakshi

సందర్భం
ఆధునిక సమాజాలను శాస్త్ర, సాం కేతిక రంగాలు లేకుండా ఊహించ లేం. మరో మాటలో చెప్పాలంటే ఆధునిక మానవ అభివృద్ధికి దినది నాభివృద్ధి చెందుతున్న శాస్త్రీయ పరిజ్ఞానమే మూలం. అందుకే ఎంతో ముందు చూపుతో డాక్టర్ అంబేడ్కర్ ప్రజలలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, దృక్పథాన్ని పెంపొం దించాల్సిన బాధ్యత ప్రభుత్వా లదని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఎ (హెచ్) ద్వారా స్పష్టం చేశారు.
 
నేడు జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం. ఈ రోజు దేశంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు విశ్వ విద్యాలయాలలోని విద్యా ర్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, శాస్త్ర, విద్యా రంగ, వైద్య, సాంకేతిక, పరిశోధనా సంస్థలతోపాటు అన్ని విద్యా సంస్థలూ నేషనల్ సైన్స్ డే  జరుపుకుంటున్నాయి. రామన్ ఎఫెక్ట్ (కాంతి వక్రీభవనం) ఆవిష్కరణ ద్వారా భారతీయ శాస్త్ర పరిశో ధనా రంగ చరిత్రను కొత్త పుంతలు తొక్కించిన డాక్టర్ సీవీ రామన్ గౌరవార్థం ప్రతి ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుతున్నారు.

 ప్రజల దైనందిన వ్యవహారాల్లో శాస్త్రీయ ఆవిష్కరణల అన్వ యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తింప జేయడం మానవ సంక్షేమం కోసం శాస్త్ర రంగంలో జరుగుతున్న అన్ని ప్రయత్నాలను, సాధిం చిన విజయాలను ప్రచారం చేయడం, దేశ ప్రజల్లో శాస్త్రీయ భావా లను పెంపొందింపజేయడం, శాస్త్ర, సాంకేతిక రంగాలను జనరం జీకరించి మూఢనమ్మకాలను పోగొట్టడం ‘నేషనల్ సైన్స్ డే’ లక్ష్యాలు.
 కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో, దేశంలో ప్రస్తుతం అనేక పెడ ధోరణులు, అశాస్త్రీయ పోకడలు చోటుచేసుకున్నాయి. వాస్తు, ముహూర్తం, యాగాల పేరు మీద ప్రజల బలహీనతలను వాడు కుంటున్నారు. శోచనీయమైన విషయం ఏమిటంటే రాజ్యాంగానికి  కట్టుబడి నడుచుకుంటామని ప్రమాణం చేసిన వారే దానికి తూట్లు పొడుస్తున్నారు. విద్య, వైద్యం అన్ని రంగాల్లో అశాస్త్రీయ భావాలను ప్రోత్సహిస్తూ అభివృద్ధి చేసిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పరిహసిస్తున్నారు. ఛాందస వాదానికి బలం చేకూరుస్తున్నారు.

 జాతీయ స్థాయిలో కూడా అనేక పెడధోరణులు, అశాస్త్రీయ పోకడలు చోటుచేసుకుంటున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా పాలకవర్గాలు అనుసరిస్తున్నాయి. రచయితలు, కళాకారులు, విద్యార్థులు, ప్రజాస్వామిక శక్తుల మీద దాడులు తీవ్రమయ్యాయి. ప్రశ్నించే తత్వాన్నే కాదు, మాట్లాడే స్వాతం త్య్రాన్ని కూడా హరించే స్థితి ఈ రోజు ఏర్పడింది. ప్రజాస్వామ్య విలువలు అడుగంటుతున్నాయి. సమాజంలో అసహనం రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రజలు అభద్రతకు గురవుతున్నారు.

 రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, దేశ స్వావలంబన కోసం సైన్స్ అనే నినాదాలతో సామాన్య ప్రజలకు చేరినప్పుడే సైన్సుకు సార్థకత ఉంటుంది. ఈ లక్ష్యంతోనే జాతీయ సైన్స్ దినోత్సవమైన 28 ఫిబ్రవరి 1988 రోజున విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జన విజ్ఞాన వేదిక (జేవీవీ)ను ఏర్పాటైంది. వివిధ రకాల కళా జాతలు నిర్వహించి ప్రజలలో సైన్సు గురించి, శాస్త్రీయ పరిజ్ఞానం గురించి విస్తృత ప్రచారం చేశారు. ఒక రకంగా చెప్పా లంటే కళా జాత పక్రియను పరిచయం చేసింది జేవీవీయే. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, తొంబైలలో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంలో జేవీవీ కార్య కర్తలు, ఉపాధ్యాయులు వేలాదిగా పాల్గొనడం, ఆ అక్షరాస్యత ఉద్యమం నుంచి వచ్చిన సారా వ్యతిరేక ఉద్యమం తదనంతరం సంపూర్ణ మద్యనిషేధాన్ని రాష్ట్రంలో విధించడాన్ని చరిత్రలో గుర్తుంచుకునే కొన్ని అంశాలు. విద్యా ఆరోగ్య రంగాల్లో తమదైన శైలిలో పనిచేసిన సంస్థ జేవీవీ. విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మూఢనమ్మకాలు వంటి అంశాలపై పలు కార్యక్రమాలద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది.

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత 2014 జూన్ 1న జేవీవీ తన పేరు మార్చుకుని ఉభయ రాష్ట్రాలలో ‘ప్రజా సైన్సు వేదిక’గా పనిచేయడం మొదలు పెట్టింది. ఉభయ రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఏ రాజకీయ పార్టీలకు అను బంధం లేకుండా మెరుగైన శాస్త్రీయ సమాజం కోసం పని చేస్తున్న ఏకైక సంస్థ ప్రజా సైన్స్ ఉద్యమ వేదిక.

 వర్తమాన సమాజంలో సంక్షోభానికి కారణమవుతున్న అంశా లను సమీక్షించుకుని భవిష్యత్తు ప్రణాళికలను, కార్యక్రమాలను నిర్ణయించడం కోసం ప్రజాసైన్సు వేదిక ఉభయ రాష్ట్రాల ప్రథమ మహాసభలు ఈ నెల 28 (ఆదివారం)న హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా ‘వర్తమాన సమాజం: అవాంఛిత, అశాస్త్రీయ పోకడలు’ అనే అంశం మీద ఉదయం పది గంటలకు సదస్సు ఉంటుంది. ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సీసీఎంబీ వ్యవస్థాపక అధ్యక్షులు డా. పీఎం భార్గవ, జస్టిస్ చంద్రకుమార్, గోరేటి వెంకన్న, ఆచార్య జయధీర్ తిరుమలరావు, డా. చందనా చక్రవర్తి, డా. కె.బాబూ రావు, డా. ఎం. చెన్న బసవయ్య తదితరులు పాల్గొంటారు. ఈ మహాసభల్లో ఉభయ రాష్ట్రాల నుంచి సంస్థ ప్రతినిధులు పాల్గొంటారు. ప్రధానంగా అశాస్త్రీయ పోకడలపై చర్చ సాగే ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతున్నాం.

(నేడు నేషనల్ సైన్స్ డే ... హైదరాబాద్‌లో ప్రజా సైన్సు వేదిక  ప్రథమ మహా సభ)

 (వ్యాసకర్త : ప్రొ.వి.కృష్ణ అధ్యక్షులు, ప్రజా సైన్సు వేదిక
 మొబైల్: 9849603071)

మరిన్ని వార్తలు