ఎంత పని చేశావు కన్నా..

21 Jan, 2018 08:50 IST|Sakshi

ఎస్‌.రాయవరం (పాయకరావుపేట): తల్లి మందలించిదన్న మనస్తాపంతో ఓ బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిమ్మాపురం గ్రామానికి చెందిన కరెడ్డి సాయి అస్రిద్‌ (13) శనివారం ఉదయం అప్పటిదాక ఆడుకుంటూనే ఉన్నాడు. చెల్లెల్ని ఏడిపిస్తున్నావెందుకని తల్లి కేకలు వేయడంతో చిన్నబుచ్చుకొని లోనికి వెళ్లాడు. పనిలోపడి తల్లి పట్టించుకోలేదు. తర్వాత చూడగా పక్క గదిలోనికి వెళ్లి ఫ్యాను ఉక్కుకు చీర బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలోకి వెళ్లిన కుమారుడు ఏమి చేస్తున్నాడని చూడగా ఉరికి వేలాడుతూ అపస్మారక స్థితిలో కనిపించాడు.

హుటాహుటిన నక్కపల్లి 30 పడకల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణం పోయినట్టు వైద్యులు తెలిపారు. మృతుడు సాయి అస్రిద్‌ తిమ్మాపురం శ్రీవిశ్వశాంతి కాన్వెంట్‌లో 8 వ తరగతి చదువుతున్నాడు. ఒక్కగాని ఒక్క కుమారుడు కళ్ల ముందే విగత జీవిగా మారడంతో తండ్రి రమణ కుప్పకూలిపోయారు. తల్లి గుండె పగిలేలా రోదిస్తోంది. విషయం తెలుసుకున్న ఎస్‌.రాయవరం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. అస్రిద్‌ పాఠశాలలో మొదటి తరగతి నుంచి తెలివైన విద్యార్ధిగా గుర్తింపు పొందాడని ఉపాధ్యాయులు, మిత్రులు తెలిపారు. ఇదే పాఠశాలలో తల్లి నాగమణి టీచర్‌గా పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు