వ్యాపారుల గుండెల్లో గు'బిల్లు'

1 Feb, 2018 13:03 IST|Sakshi
హోటల్‌

విస్తృతమైన వాణిజ్య పన్నుల శాఖ డెకాయ్‌ ఆపరేషన్స్‌

ఇప్పటికే హోటల్‌ నిర్వాహకులపై 91 కేసులు నమోదు

మిగిలిన వ్యాపారులపైనా పెరిగిన నిఘా...

వీకెండ్స్‌లో కుటుంబంతో... అప్పుడప్పుడూ మిత్రులతో సరదాగా... ఇంకా అతిథులు వచ్చినపుడు అందరితోనూ... హోటల్‌కెళ్లి విలాసంగా నచ్చిన ఆహారం తినేసి వారడిగినంత మొత్తాన్ని చెల్లించేసి... అదనంగా సర్వర్‌కు టిప్పు ఇచ్చేసి దర్జాగా వచ్చేస్తుంటాం. అక్కడితో మన పని అయిపోయింది. కానీ అలా ఎడా పెడా బిల్లులు వసూలు చేసే హోటల్‌ నిర్వాహకులు మనకు ఇచ్చే బిల్లుల మేరకు పన్ను చెల్లిస్తున్నారో లేదో చూడం. అందుకే వాటిపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి పడింది. డెకాయ్‌ ఆపరేషన్‌ పేరుతో తనిఖీలు చేపడుతోంది. పన్ను ఎగ్గొట్టేవారి భరతం పడుతోంది.

విజయనగరం ఫోర్ట్‌: పన్ను ఎగ్గొట్టే వాణిజ్య సంస్థలపై సంబంధిత పన్నుల శాఖ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తోంది. డెకాయ్‌ ఆపరేషన్స్‌ను ముమ్మరం చేసింది. ఇవి ఎక్కువగా హోటళ్లపైనే  చేపడుతున్నారు. వినియోగదారులకు బిల్లులు ఇవ్వకుండా పన్ను ఎగవేస్తున్నారన్న ఫిర్యాదులు అధికంగా వస్తున్న నేపథ్యంలో వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. వీటితో పాటు మిగిలిన మరికొన్ని వ్యాపారాలపైనా సంబంధిత అధికారులు డెకాయ్‌ ఆపరేషన్స్‌ మొదలు పెట్టారు.

బిల్లులు ఇవ్వని హోటళ్లు
విజయనగరం డివిజన్‌లో జీఎస్టీ రిజిస్ట్రర్డ్‌ హోటళ్లు 121 ఉన్నా యి. వీటి నిర్వాహకులు హోటళ్లకు వచ్చే వినియోగదారులకు బి ల్లులు ఇవ్వరు. చిన్న కాగితంపై వారు చెల్లించాల్సిన మొత్తాలను బేరర్‌తో పంపిస్తారు. వాటిని చూసే వినియోగదారులు టిప్పుతో సహా మారు మాట్లాడకుండా చెల్లించేసి... నోట్లో కాసిన్ని పంచదార పూతతో ఉన్న సోపు గింజల్ని వేసుకుని వచ్చేస్తున్నారు. ఇలా హోటల్‌ వ్యాపారులు అనధికార బిల్లుల ద్వారా పన్ను నుంచి బయటపడుతున్నారు. అందుకే హోటళ్లపైనే ఎక్కువగా దృష్టి సారించిన అధికారులు డెకాయ్‌ ఆపరేషన్లు చేపట్టి ఇప్పటివరకూ 91 కేసులు నమోదు చేశారు. ఇందులో 56 కేసులకు సంబంధించి రూ. 6,90,000 అపరాధ రుసుం వసూలు చేశారు.

మిగతా వ్యాపారులపైనా నిఘా...
విజయనగరం వాణిజ్య పన్నులశాఖ డివిజన్‌ పరిధిలో కాశీబుగ్గ, నరసన్నపేట, రాజాం, శ్రీకాకుళం, విజయనగరం తూర్పు, విజ యనగరం దక్షిణ, విజయనగరం పశ్చిమ సర్కిల్స్‌ ఉన్నాయి. రాష్ట్ర పరిధిలో 14,503 డీలర్లు, కేంద్ర పరిధిలో 5,195 డీలర్లు ఉన్నారు. కాశీబుగ్గ సర్కిల్‌లో రాష్ట్ర  పరిధిలో 1756, కేంద్ర పరిధి లో 501 మంది డీలర్లు,  నరసన్నపేట సర్కిల్‌లో రాష్ట్ర పరిధిలో 1399 మంది, కేంద్ర పరిధిలో 466 మంది ఉన్నారు. రాజాంలో రాష్ట్ర పరిధిలో 2,173, కేంద్ర పరిధిలో 696 మంది, శ్రీకాకుళం సర్కిల్‌లో రాష్ట్రపరిధిలో 2,567మంది, కేంద్ర పరిధిలో 922 మం ది ఉన్నారు. విజయనగరం తూర్పు సర్కిల్‌లో రాష్ట్ర పరిధిలో 1619 మది, కేంద్ర పరిధిలో 624 మంది, విజయనగరం దక్షణ సర్కిల్‌లో రాష్ట్ర పరిధిలో 1548 మంది, కేంద్ర పరిధిలో 654 మంది ఉన్నా రు. విజయనగరం పశ్చి మ సర్కిల్‌లో రాష్ట్ర పరిధిలో 1621 మంది, కేంద్ర పరిధిలో 671 మంది డీలర్లు ఉన్నారు. వీరందరిపైనా డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 329 ఆపరేషన్ల ద్వారా రూ.43.91 లక్షలు అపరాధ రుసుం వసూలు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వాణిజ్య పన్నులశాఖ అధికారులు డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహించడంతో వ్యాపారులు హడలిపోతున్నారు.

హోటళ్లపైనే ఎక్కువ ఫిర్యాదులు
హోటల్‌ నిర్వాహకులు బిల్లులు ఇవ్వడం లేదంటూ ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. అందుకే డెకాయ్‌ ఆపరేషన్లు హోటల్స్‌పై ఎక్కువగా చేస్తున్నాం. ప్రతీ హోటల్‌ నిర్వాహకుడు, వ్యాపారి బిల్లులు ఇవ్వాల్సిందే. ఇచ్చే వరకు ఈ ఆపరేషన్లు చేస్తూనే ఉంటాం.-ఎన్‌.శ్రీనివాస్, జాయింట్‌ కమిషనర్‌ ఏపీ ట్యాక్స్‌(జీఎస్టీ)  

మరిన్ని వార్తలు