నైపుణ్యాభివృద్ధిరస్తు..!

1 Feb, 2018 13:50 IST|Sakshi
వెబ్సైటు చిత్రం

పూచీకత్తు లేకుండా శిక్షణకు రుణ సదుపాయం

ఎన్‌ఎస్‌డీఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

పశ్చిమగోదావరి , నిడమర్రు: దేశంలోని వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులు ఆయా రంగంలో రాణించేందుకు భారత ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేషనల్‌ స్కిల్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌డీసీ)  పథకం ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులకు బ్యాంకులు రుణ సదుపాయాన్ని కల్పిస్తాయి. ఈ పథకం నుంచి శిక్షణ పొందడంతోపాటు అనంతరం ఉపాధికి అవసరమైన రుణాలు పొందవచ్చు. దీనికోసం అభ్యర్థులు ముందుగా సంబంధిత వెబ్‌సైట్‌లో వారి వివరాలు నమోదు చేసుకోవల్సి ఉంది.

అర్హత ఇలా..
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు(ఐటీఐ), పాలిటెక్నిక్‌ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎడ్యుకేషన్‌ బోర్డుల గుర్తింపు పొందిన శిక్షణ సంస్థలు, కేంద్ర నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కలిగిన శిక్షణకేంద్రాలలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఈ తరహా రుణాలు పొందేందుకు అర్హులు.

రుణం పరిధిలోకి వచ్చే ఖర్చులు..
ట్యూషన్‌/కోర్సు ఫీజు, పరీక్ష రుసుము, గ్రంథాలయ రుసుము, ప్రయోగ«శాల రుసుము, కాషన్‌ డిపాజిట్‌ పుస్తకాలు, పరిస్థితులను బట్టి వసతి కోసం అయ్యే ఖర్చులు, కోర్సుకు అవసరమయ్యే ఇతర వస్తువుల ఖర్చులు.

రుణ మొత్తం ఇలా..
రూ.5 వేల నుంచి మొదలుకుని రూ.1.5 లక్షల వరకూ ఈ పథకం కింద రుణం మంజూరు చేస్తారు.
ఈ తరహా రుణాలపై ఎటువంటి మార్జిన్‌ మనీ కట్టాల్సిన పనిలేదు. అంటే మొత్తం రుణాన్ని బ్యాంకే మంజూరు చేస్తుంది.
అలాగే బ్యాంకు నుంచి పొందే ఈ రుణాలకు ఎటువంటి పూచీకత్తు అవసరంలేదు.

వడ్డీ ఇతర రుసుములు
ఈ రుణాలకు వసూలు చేసే వడ్డీ రేటు బ్యాంకును బట్టి మారుతుంది. ప్రస్తుతం ఈ తరహా రుణాలకు బ్యాంకు వడ్డీ రేటు 11 నుంచి 12 శాతం మధ్య ఉంది. నైపుణ్యాభివృద్ధి రుణానికి ఎటువంటి ప్రాసెసింగ్‌ ఫీజు ఉండదు.

తిరిగి చెల్లింపు ఇలా..
రుణాలను తిరిగి చెల్లించేందుకు తగినంత గడువు ఇస్తారు. ఏడాదిలోపు కోర్సులకు– కోర్సు పూర్తిచేసిన 6 నెలల వరకూ, సంవత్సరం పైబడిన కోర్సులకు–కోర్సు పూర్తి చేసిన 12 నెలల మారటోరియం పీరియడ్‌ ఉంటుంది. ఈ కాలంలో సాధారణ వడ్డీని వసూలు చేస్తారు.

రుణ చెల్లింపునకు గడువు
రుణాలను తిరగి చెల్లించేందుకు తీసుకున్న మొత్తం ఆధారంగా గడువు ఇస్తారు.
రూ.50 వేలకు మూడేళ్లు
రూ.50 నుంచి రూ.లక్ష వరకూ ఐదేళ్లు
రూ.లక్ష పైబడిన రుణానికి ఏడేళ్లు గడువు ఉంటుంది.

ముందస్తు చెల్లింపు ఇలా..
రుణ గ్రహీత ఎటువంటి ముందస్తు రుసుములు లేకుండా రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. ప్రమాదం/మరణం/వైకల్యం కారణంగా అభ్యర్థి కోర్సు పూర్తి చేయలేకపోతే శిక్షణ సంస్థ నుంచి మిగిలిన శిక్షణకాలానికి సంబంధించిన సొమ్మును ప్రోరేటా రీయింబర్స్‌మెంట్‌ పద్ధతిలో వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. బ్యాంకులు అర్హత కలిగిన అభ్యర్థులకు పరిమితి మేరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. దీనిద్వారా నైపుణ్యాన్ని అభివృద్ధి పరుచుకుని సరైన ఉపాధిని పొందవచ్చు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఇలా..
ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా www.nsdcindia.org అనే వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంది. వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయితే కనిపించే ముఖచిత్రంలో ‘అవర్‌ వర్క్‌’ అనే కాలంలో క్లిక్‌ చేయాలి. తర్వాత  ‘ఫండింగ్‌ ’ విండో ఓపెన్‌ అవుతుంది. ఆ విండో పైభాగంలో లాగిన్‌ కాలం కనబడుతుంది. మౌస్‌ టచ్‌ చేసిన వెంటనే అక్కడ సబ్‌మిట్‌ ప్రపోజల్, ఎన్‌ఎస్‌డీసీ ట్రైనింగ్‌ ప్యాటరన్‌ తదితర కాలంలతో పాటు సిటిజన్‌ పోర్టల్‌ లాగిన్‌ వద్ద క్లిక్‌ చేయాలి.
ఓపెన్‌ అయిన విండో వద్ద న్యూ యూజర్‌ వద్ద క్లిక్‌ చేస్తే సైన్‌అప్‌ విండో ఓపెన్‌ అవుతుంది. అక్కడ మీ వివరాలు నమోదు చేసుకోవాలి.
ఈ పథకకానికి సంబంధించి ఏపీలో 37 ప్రాంతాల్లో వివిధ రంగాలకు సంబంధించిన శిక్షణ సంస్థలు ఉన్నాయి. వాటి వివరాలు అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లు ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. .

మరిన్ని వార్తలు