మాజీ సీఎం ఓటుపై మల్లగుల్లాలు

6 Feb, 2018 13:18 IST|Sakshi
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి

పశ్చిమగోదావరి, పెనుమంట్ర:  మార్టేరు గ్రామంలోని ఓటర్ల జాబితాలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డికి ఓటు హక్కు ఉండటంపై రెవెన్యూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆయనతోపాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కూడా ఇదే జాబితాలో చోటు దక్కడంపైనా ఆరా తీస్తున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో సోమవారం ‘సొంతూరు పీలేరు.. ఓటున్నది మార్టేరు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనం స్థానికంగా సంచలనమైంది. దీంతో  ఏలూరు నుంచి జేసీ కోటేశ్వరరావు ఫోన్‌లో మండల రెవెన్యూ అధికారులను ఆరా తీశారని సమాచారం. 

ఈకథనంపై పెనుమంట్ర తహసీల్దార్‌  వెంకట్రావు స్పందించి ప్రాథమిక విచారణ చేపట్టారు. మార్టేరులోని 104వ బూత్‌ అధికారిని ఆరా తీశారు. ఆ ఓట్లను ఫారం–7 ద్వారా వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్‌ చెప్పారు. అలాగే సాయంత్రం ఎమ్మార్వో కార్యాలయంలో ఆచంట నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారి నరసింహరావు పోలింగ్‌బూత్‌ స్థాయి సిబ్బంది, పర్యవేక్షణాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జాబితాల్లో పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు