సాక్షి,పాడేరు: ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాకు ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఐదు కొత్త అంబులెన్స్లను సోమవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో కలెక్టర్,ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉన్నారని, వారిలో ఓ డాక్టర్ సచివాలయం పరిధిలో వైద్యసేవలు అందించాలన్నారు. పీహెచ్సీల్లో 90 శాతం వైద్యసిబ్బంది ఖాళీలను భర్తీ చేశామని,అరకు,చింతపల్లి ప్రాంతీయ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. వైద్య ఆరోగ్య సేవలకు అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని,ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఐటీడీఏ పరిధిలో ప్రతి మండలానికి రెండు చొప్పున 104 అంబులెన్స్లు, జిల్లాకు సంబంధించి 35 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రత్నకుమారి. డీఎంహెచ్వో డాక్టర్ జమాల్ బాషా,డీటీసీ డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, 104 జిల్లా మేనేజర్ మురళి పాల్గొన్నారు.