వీఆర్ పురం: అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ఆర్అండ్ఆర్ పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని తహసీల్దార్ ఎన్.శ్రీధర్ అన్నారు. పోలవరం ముంపు గ్రామం రాజుపేట కాలనీలో సోమవారం నిర్వహించిన ఆర్అండ్ఆర్ గ్రామసభలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా అర్హుల జాబితాలోని పేర్లను క్లస్టర్ల వారీగా వెల్లడించారు. పేర్లు నమోదు కాని వారు తిరిగి దరఖాస్తు చేసుకొవచ్చునన్నారు. అలాగే ప్రభుత్వం ఆర్అండ్ ప్రక్రియలో భాగంగా గిరిజనులకు, గిరిజనేతరులకు ఏ విధంగా పునరావాసం కల్పింస్తుందో విపులంగా వివరించారు. రాజుపేట కాలనీలో మొత్తం 663 నిర్వాసిత కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు. అందులో రెండు కుంటుంబాలు గిరిజన కుటుంబాలు కాగా మిగిలిన వారందరూ గిరిజనేతరులని చెప్పారు. రాజుపేట కాలనీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ను 13.10.2022 తేదీన ప్రకటించినట్టు తెలిపారు. ఆయా తేదీనే ఇకపై కటాఫ్ తేదీగా ప్రకటించినట్టు పేర్కొన్నారు. ఆ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను పీడీఏఫ్గా గుర్తించి వారికి ఆర్అండ్ఆర్ పరిహారం అందచేయనున్నట్టు చెప్పారు.అనంతరం అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరించారు. పోలవరం భూసేకరణ స్పెషల్ కలెక్టర్ లక్ష్మీపతి, ఆర్అండ్ఆర్ కమిటీ సభ్యుడు ఉండవల్లి గాంధీబాబు, జెడ్పీటీసీ సభ్యుడు వాళ్ల రంగారెడ్డి, రాజుపేట సర్పంచ్ వడ్డానపు శారద,ఎపీటీసీ సభ్యురాలు భాగ్యలక్ష్మి ,ఉప సర్పంచ్ ముంజపు రాంబాబు ,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.