చింతపల్లి: పాలిసెట్ కోసం గిరిజన విద్యార్థులకు పోలీస్శాఖ కల్పిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. పాలిసెట్ రాసే విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు చింతపల్లి,గూడెం కొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో మంగళవారం ఎంపిక పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చింతపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిభ చూపిన 120 మందిని ఎంపిక చేసి 20 రోజుల పాటు అచ్యుతాపురంలోని ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాలలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ అరుణ్ కిరణ్ పాల్గొన్నారు.