ఆతిథ్యం.. అదిరింది

29 Mar, 2023 01:24 IST|Sakshi

జీ 20 సదస్సులో పాల్గొనేందుకు ఇందులో సభ్యులుగా ఉన్న 15 దేశాలకు చెందిన ప్రతినిధులు విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో విదేశీ ప్రతినిధులకు తెలుగు సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికారు. అతిథులకు కూచిపూడి నృత్యంతో స్వాగతం పలికి.. పూలమాలలు, శాలువా వేసిన అనంతరం.. కుంకుమ బొట్టు పెట్టి.. నగరానికి ఆహ్వానించారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లకు విదేశీ ప్రతినిధులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆతిథ్యం అదిరిపోయిందంటూ.. సదస్సుల్లో పలు దేశాల ప్రతినిధులు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. తొలిరోజు సదస్సు ముగిసిన అనంతరం.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అతిథులకు గాలా డిన్నర్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా వంటకాలతో పాటు.. భారత్‌లో ప్రసిద్ధి చెందిన రుచుల్ని అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆతిథ్యానికి విదేశీ అతిథులు ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వాహ్‌వా అనిపించాయి. కొమ్ము నృత్యం నుంచి కూచిపూడి వరకు, భరతనాట్యం, కథాకళితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రధాన నృత్యాలు ప్రదర్శించారు. అదేవిధంగా.. పలు పౌరాణిక పాత్రలతో ఏక పాత్రాభినయాలు మంత్రముగ్ధుల్ని చేశాయి.

విమానాశ్రయంలో విదేశీ అతిథులకు సంప్రదాయ స్వాగతం

మరిన్ని వార్తలు