మునగపాక: భూముల రీ సర్వేలో నిర్ల క్ష్యం వహించిన పాటిపల్లి సచివాలయ సర్వేయర్ ఎ.శ్రావణిని జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి మంగళవారం సస్పెండ్ చేశారు. పాటిపల్లిలో జరుగుతున్న రీ సర్వే పనులను పరిశీలించేందుకు వచ్చిన జేసీ అనేక లోటుపాట్లను గమనించారు. విధి నిర్వహణలో విఫలమైన సంబంధిత సర్వేయర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం శాశ్వ త భూ హక్కు–భూ రక్ష కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడితే కొంతమంది అధికారులు నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఆమె వెంట మండల సర్వేయర్ శ్రీనివాసరావు, ఆర్ఐ రమేష్ తదితరులున్నారు. అంతకుముందు మునగపాక రెవెన్యూ కార్యాలయానికి చేరుకున్న ఆమె మండలవ్యాప్తంగా అమలవుతున్న రీ–సర్వేకు సంబంధించి వీఆర్వోలతో సమావేశమయ్యారు. గ్రామాలవారీగా ఇంతవరకు ఎంత మేర సర్వే జరిగిందనే విషయమై సమీక్ష చేశారు.