అనకాపల్లిటౌన్: ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయంలో బుధవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ మండలంలో శ్రీ చక్రానికి అర్చకులు రేజేటి చక్రవర్తి ప్రత్యేక పూజలు చేసి, పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ సుజాత పర్యవేక్షణలో ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పించారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
అమ్మవారిని ఎంపీ సత్యవతి, విష్ణుమూర్తి దంపతులు, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు డాక్టర్ గొండు సీతారాం, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సతీమణి రమణమ్మ, జెడ్పీ వైస్ చైర్పర్సన్ భీశెట్టి వరహా సత్యవతి, అగ్నిమాపక శాఖ డీఎఫ్వో లక్ష్మణస్వామి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు దంపతులు, సీఐలు రవికుమార్, శ్రీనివాసరావులు దర్శించుకున్నారు. ఉగాది వేడుకల్లో ఆలయ ఈవో చంద్రశేఖర్, 80వవార్డు ఇన్చార్జి కొణతాల భాస్కరరావు పాల్గొన్నారు.
ప్రత్యేక అలంకరణలో అమ్మ దర్శనం
ఆలయానికి పోటెత్తిన భక్తులు
శ్రీచక్రానికి ప్రత్యేక పూజలు