డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి దేవస్థానంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించారు. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమ్మవారు స్వర్ణాభరణాలు, పట్టుచీరలో దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గణపతి పూజ, మండపారాధన అనంతరం ఎన్వీఎస్ఆర్కే ప్రసాద్ పంచాంగ పఠనం చేశారు. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవాలయంలో గల వేదపండితులు సీహెచ్ఎల్ఎన్ అవధానులు, ఎంవీ ఘనాపాఠి, అర్చకుడు బి.శేషుభట్టార్కి పండిత సత్కారం జరిగింది. కార్యక్రమంలో ఈవో కె.శిరీష, ధర్మకర్తల మండలి చైర్పర్సన్ కొల్లి సింహాచలం, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.