నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్‌

18 May, 2021 04:55 IST|Sakshi
ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన పీఎస్‌ఏ ప్లాంట్‌

కర్నూలు పెద్దాస్పత్రిలో పీఎస్‌ఏ ప్లాంట్‌ ట్రయల్‌ రన్‌

దాతలు ముందుకు రావాలని కలెక్టర్‌ పిలుపు

కర్నూలు (హాస్పిటల్‌) : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన.. ప్రకృతి నుంచి ఆక్సిజన్‌ తయారు చేసే ప్రెజర్‌ స్వింగ్‌ అడ్జార్పషన్‌(పీఎస్‌ఏ) ప్లాంట్‌ ట్రయల్‌ రన్‌ను సోమవారం జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ప్రారంభించారు. ఇది ప్రతి నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తుంది. ట్రయల్‌ రన్‌ వారం పాటు కొనసాగించి.. లోటు పాట్లు గమనించాక పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని చెప్పారు. ఇటువంటి ప్లాంట్ల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని కోరారు.

ఇలాంటి ప్లాంట్‌నే ఈ ఆస్పత్రిలో సినీ నటుడు సోనూసూద్‌ ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం దాదాపు వెయ్యి మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని, వారికి ఆక్సిజన్‌ కొరత రాకుండా వార్‌ రూమ్‌ ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్‌ చెప్పారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.నరేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కర్నూలులో 150 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు 
ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ విరాళం 

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లతో హఫీజ్‌ఖాన్‌  

కరోనా బాధితుల కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ 150 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను విరాళంగా ఇచ్చారు. యూఎంఎంసీ ఆస్పత్రి(హోస్టన్‌–అమెరికా), హఫీజ్‌ఖాన్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా వీటిని సమకూర్చాయి. పెద్దాస్పత్రి ప్రాంగణంలోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో వంద పడకలతో కోవిడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి.. అక్కడ 100 కాన్సన్‌ట్రేటర్లను వినియోగిస్తారు.  ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్‌ రోగుల కోసం మిగిలిన వాటిని వినియోగిస్తారు. 

మరిన్ని వార్తలు