పది లక్షల ప్రాణాలను కాపాడాయ్‌!

3 Dec, 2022 04:21 IST|Sakshi

ప్రాణదాతలుగా ఆదుకుంటున్న 108 అంబులెన్స్‌లు 

గ్రామీణ ప్రాంతాల్లో కాల్‌ చేసిన 20 నిమిషాల్లోపే రాక 

అత్యధికంగా 19 శాతం ఎమర్జెన్సీ కేసుల్లో ఆస్పత్రులకు గర్భిణుల తరలింపు  

ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సీఎం జగన్‌ అత్యధిక ప్రాధాన్యం 

432 కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేసి నిరంతర సేవలు

సాక్షి, అమరావతి: కుయ్‌.. కుయ్‌ అంటూ పరుగులు తీసే అంబులెన్స్‌లను చూస్తే  గుర్తొచ్చేది నాడు వైఎస్సార్‌.. నేడు సీఎం జగన్‌. గత సర్కారు హయాంలో 108 వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ప్రాణాపాయంలో ఉన్నవారు 108కి ఫోన్‌ చేస్తే డీజిల్‌ లేదని, డ్రైవర్లు లేరనే సమాధానం వచ్చేది. ఒక్కోసారి అసలు స్పందించే నాథుడే ఉండడు. అలాంటి వ్యవస్థను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే తిరిగి గాడిలో పెట్టారు. మండలానికి కచ్చితంగా ఒకటి అందుబాటులోకి తెచ్చి నిరంతరం సేవలందించేలా చర్యలు చేపట్టారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు పది లక్షలకు పైగా ప్రాణాలను 108 అంబులెన్స్‌లు కాపాడగలిగాయి.  

ఏజెన్సీలో అరగంట లోపే.. 
గత జనవరి నుంచి నవంబర్‌ 25వ తేదీ వరకు 10,10,383 ఎమర్జెన్సీ కేసులను 108 అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు తరలించారు. గిరిజన ప్రాంతాల్లో కాల్‌ చేసిన అరగంట లోపే చేరుకుంటున్నాయి. 108 అంబులెన్స్‌ల వ్యవస్థ పనితీరును విశ్లేషిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఈమేరకు నివేదిక రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్‌ చేసిన 20 నిమిషాల లోపు 108 అంబులెన్స్‌లు చేరుకోవాలనే నిబంధన విధించగా 18 – 19 నిమిషాల్లోనే వస్తున్నాయి.

పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాల గడువు విధించగా ట్రాఫిక్‌ తదితర సమస్యల కారణంగా 15 నుంచి 18 నిమిషాల సమయం పడుతోంది. అత్యధికంగా 19 శాతం ఎమర్జెన్సీ కేసుల్లో గర్భిణులను 108 అంబులెన్స్‌లు ప్రసవం కోసం అస్పత్రులకు తరలిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే 432 కొత్తగా 108 అంబులెన్స్‌లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 768 అంబులెన్స్‌లు పనిచేస్తున్నాయి. ఇందులో బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్, అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్ట్, నవజాత శిశువుల అంబులెన్స్‌లు తదితరాలున్నాయి.  

మరిన్ని వార్తలు