అర్హతే ప్రామాణికం

7 Jan, 2021 04:59 IST|Sakshi
గుంటూరు జిల్లా తెనాలి మండలం నేలపాడు–1 ఇళ్ల స్థలాల లేఅవుట్‌లో లబ్ధిదారుల కోలాహలం

మాటనిలబెట్టుకున్న సీఎం అంటూ జనం జేజేలు

కోలాహలంగా 13వ రోజు స్థలం పట్టాలు, ఇళ్ల పత్రాల పంపిణీ

సాక్షి నెట్‌వర్క్‌: కులం చూడం.. మతం చూడం.. పార్టీ చూడం.. అర్హులైన ప్రతిపేదకు సంక్షేమ ఫలాలు అందిస్తాం.. లబ్ధిపొందడానికి అర్హతే ప్రామాణికం.. ఇవీ సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పే మాటలు. ఆ మాటలు క్షేత్రస్థాయిలో నిరూపణ అవుతున్నాయి. ఏళ్ల తరబడి  జాగాకోసం కళ్లు కాయలుకాచేలా చూస్తూ.. చెప్పులరిగేలా తిరుగుతూ.. పడిన కష్టాలు తీరుతున్నాయని లబ్ధిదారులు సంతోషంగా చెబుతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాల పంపిణీ కార్యక్రమం 13వ రోజు బుధవారం కోలాహలంగా సాగింది. టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థికి, జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి భార్యకు ఇంటిపట్టాలు పంపిణీ చేశారు. తనకు గతంలో టీడీపీ అంటే అభిమానమని, ఆ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లు తనకు స్థలం ఇవ్వలేదని.. ఇప్పుడు తాను కాలు కదపకుండా స్థలమేకాదు.. ఇల్లు కూడా మంజూరు చేశారని మరో లబ్ధిదారు చెప్పారు.

ఇవన్నీ చూస్తుంటే అర్హతే ప్రామాణికమన్న సీఎం మాటలు నూరుశాతం అమలవుతున్నాయని ప్రజలు జేజేలు పలుకుతున్నారు. కృష్ణాజిల్లాలో 25,645 ఇంటిస్థలం పట్టాలు, ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. మంత్రులు వెలంపల్లి, కొడాలి నాని పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 17,285 మందికి పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 15,809 ఇంటిస్థలం పట్టాలు, ఇళ్ల పత్రాలను పంపిణీ చేశారు. మంత్రులు మేకతోటి సుచరిత, బొత్స పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 14,990 పట్టాలు అందజేశారు. విశాఖ జిల్లాలో 10,904 పట్టాలు పంపిణీ చేశారు.
వైఎస్సార్‌ జిల్లా మీనాపురం వద్ద ఇళ్ల స్థలాల లేఅవుట్‌  

మంత్రి ముత్తంశెట్టి  పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 8,809 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో 8,577 పట్టాలు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 8,401 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో 4,624 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వైఎస్సార్‌ జిల్లాలో 4,430 మందికి, కర్నూలు జిల్లాలో 4,333 మందికి పట్టాలు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 3,529 మందికి పట్టాలు అందజేశారు. డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మంత్రి శ్రీరంగనాథరాజు, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో 3,322 మందికి పట్టాలు పంపిణీ చేశారు. 

మరిన్ని వార్తలు