వంట నూనెల విక్రయాలకు 150 కియోస్కులు

23 Mar, 2022 02:15 IST|Sakshi

సాక్షి, అమరావతి: మునిసిపల్‌ మార్కెట్లు, సూపర్‌ బజార్లలో ప్రభుత్వ ఔట్‌లెట్ల ద్వారా వంట నూనెల విక్రయాలను పెంచనున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వంట నూనెల ధరల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం నియమించిన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సోమవారం భేటీ అయిందన్నారు.

ఏపీ ఆయిల్‌ఫెడ్‌ ద్వారా 111 మునిసిపాలిటీలు, 34 కార్పొరేషన్లలో వంట నూనెల విక్రయాలకు 150 కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. స్వయం సహాయక బృందాల ద్వారా ఆయిల్‌ఫెడ్‌ ఉత్పత్తులను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో గడిచిన రెండు వారాల్లో వంట నూనెల ధరలు స్థిరంగా ఉన్నాయన్నారు. సన్‌ఫ్లవర్‌ నూనె లీటర్‌ రూ.191, వేరుశనగ నూనె రూ.175, పామాయిల్‌ రూ.155కు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయని చెప్పారు.

నూనెల అక్రమ నిల్వలపై విజిలెన్స్‌ తనిఖీలు
రాష్ట్రవ్యాప్తంగా వంట నూనెల అక్రమ నిల్వలకు సంబంధించి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంగళవారం 337 హోల్‌సేల్, రిటైల్‌ దుకాణాలతోపాటు సూపర్‌ మార్కెట్లు, ఆయిల్‌ తయారీ సంస్థలపై దాడులు చేసి 141 కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర సరుకుల చట్టం కింద 65, తూనికలు–కొలతలు చట్టం కింద 1,056, ఆహార భద్రత చట్టం కింద 41, మరో 8 మందిపై క్రిమినల్‌ కేసులు పెట్టారు 

మరిన్ని వార్తలు