22 స్థానిక సంస్థల ఎన్నికలు ఈవీఎంలతోనే

20 Jan, 2022 04:53 IST|Sakshi

కోర్టు కేసుల కారణంగా 3 కార్పొరేషన్లు, 19 మునిసిపాలిటీల్లో ఇంకా జరగని ఎన్నికలు

గతంలో రెండు విడతలు బ్యాలెట్‌ విధానంలో జరిగిన పోలింగ్‌ 

ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నీలం సాహ్ని అధికారులతో భేటీ

ఆ 22 చోట్ల ఒకేసారి ఎన్నికలు జరిగినా మొత్తం 4 వేల బూత్‌లలోనే పోలింగ్‌

ప్రస్తుతం ఎస్‌ఈసీ వద్ద 8 వేల వరకు ఈవీఎంలు

వీవీప్యాట్‌ల కోసం ప్రయత్నాలు

సాక్షి, అమరావతి: గతంలో ఎన్నికలు జరగని 22 నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈవీఎంల విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 17 నగరపాలక సంస్థలు, 106 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో కాకినాడ కార్పొ రేషన్‌ ఎన్నికలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ అధికా రంలోకి వచ్చిన తరువాత గత ఏడాది మార్చిలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలకు, నవంబర్‌లో నెల్లూరు నగరపాలక సంస్థకు, 12 పుర పాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది.

ఈ రెండు విడతల్లోను బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు జరిగాయి. కోర్టు కేసుల కా రణంగా రాజమహేంద్రవరం (రాజమండ్రి), శ్రీకా కుళం, మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థల్లో ను, ఆముదాలవలస, రాజాం (శ్రీకాకుళం జిల్లా), తణుకు, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, చింతలపూడి (పశ్చిమగోదావరి), వైఎస్సార్‌ తాడి గడప, గుడివాడ (కృష్ణా), బాపట్ల, పొన్నూరు, నర సరావుపేట (గుంటూరు), కందుకూరు, పొదిలి (ప్రకాశం), కావలి, గూడూరు, అల్లూరు (నెల్లూరు), బి.కొత్తకోట, శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా) పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. కోర్టు కేసులు కొలిక్కి వస్తే వీలైనంత త్వరగా వీటికి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సన్నాహాలు చేస్తోంది.

ఉమ్మడి ఏపీలో ఈవీఎంల విధానంలోనే..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని వారం రోజుల కిందట తన కార్యాలయ అధికారులతో సమావేశం నిర్వహించి ఈవీఎంల విధానంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్‌ ఎన్నికలు ఈవీఎంల విధానంలో నిర్వహించిన విషయాన్ని అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 8 వేల ఈవీఎంలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. 22 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా నాలుగువేల బూత్‌లలోనే పోలింగ్‌ ఉంటుందని, ఇందుకు ఆ ఈవీఎంలు సరిపోతాయని వివరించారు.

అసెంబ్లీ, లోకసభ ఎన్నికలను ఈవీఎంలతో పాటు వీవీప్యాట్‌లతో కలిపి ఉండే మిషన్లతో నిర్వహిస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద వీవీప్యాట్‌లు లేని పాత ఈవీఎంలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ఈవీఎంలకు వీవీప్యాట్‌లను అనుసంధానం చేసే అంశంపై ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్‌ను సంప్రదించి తదుపరి చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు కేసులపైనా దృష్టి ఎన్నికలు జరగని 22 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు మునిసిపల్‌శాఖ అధికారులతో సంప్రదిస్తున్నారు. నెలరోజుల కిందట నీలం సాహ్ని మునిసిపల్‌శాఖ అకారులతో సమావేశమై  ఆయా కేసుల పరిస్థితి గురించి తెలుసుకున్నారు.  

మరిన్ని వార్తలు