14 ఏళ్ల బాలిక.. 40 ఏళ్ల వ్యక్తితో నిశ్చితార్థం

21 Jun, 2022 18:18 IST|Sakshi

గూడూరు (తిరుపతి జిల్లా): కోడలికి తెలియకుండా ఆమె కుమార్తె(14)ను 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేందుకు సిద్ధమైంది అత్త. ఈ ఘటన గూడూరులో చర్చనీయాంశమైంది. పోలీసుల కథనం.. గూడూరు పట్టణం, రాణిపేటకు చెందిన నెల్లూరు సురేష్, నాయుడుపేటకు చెందిన రాజ్యలక్ష్మికి 2007లో వివాహమైంది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న సురేష్‌ మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

కొన్నాళ్ల తర్వాత ఆస్తి విషయమై రాజ్యలక్ష్మి, అత్త సుజాతమ్మ మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో రాజ్యలక్ష్మి బిడ్డలను అత్తవద్దే వదిలి నాయుడుపేటలోని పుట్టింట్లో ఉండిపోయింది. అప్పుడప్పుడూ గూడూరుకు వచ్చి పిల్లలను చూసుకుని వెళ్లేది. ఈ ఏడాది మే 25వ తేదీన కోడలికి తెలియకుండా ఆమె కుమార్తె(14)ను అత్త సుజాతమ్మ వెంకటాచలం మండలం, పూడిపర్తికి చెందిన శ్రీనివాసతేజతో నిశ్చితార్థం జరిపించింది.

విషయం తెలుసుకున్న రాజ్యలక్ష్మి పూడిపర్తికి వెళ్లి ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. తన బిడ్డ ఆచూకీ చెప్పాలని ప్రాధేయపడినా ఎవరూ కనికరించకపోవడంతో రాజ్యలక్ష్మి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

చదవండి: ('ఛీ'టింగ్‌ టీడీపీ నేతలు.. సీఎం చొరవతో లబ్ధిదారులకు ఊరట)

మరిన్ని వార్తలు