నిట్‌లోని 750 సీట్లు ఫుల్‌

28 Oct, 2021 05:20 IST|Sakshi

తొలి రౌండ్‌లోనే నిండిన సీట్లు

తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌లో చేరడానికి జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) నిర్వహించిన తొలి రౌండ్‌లోనే నిట్‌లో ఉన్న 750 సీట్లు అయిపోయాయి. ఇక్కడ చేరడానికి అంగీకారం వ్యక్తం చేస్తూ 750 మంది ఆప్షన్‌ను ఇచ్చారు. ఈ వివరాలను బుధవారం రాత్రి నిట్‌ అధికారులు వెల్లడించారు. నిట్‌లో మొత్తం సీట్లు 750 ఉండగా, ఆరు రౌండ్లలో ఈ సీట్లను ఆప్షన్‌గా ఎంచుకొనే అవకాశం ఉంది.

తొలిరౌండ్‌ బుధవారం సాయంత్రానికే సీట్లు పూర్తయ్యాయి. సీట్ల ఎంపికలో మూడు ఆప్షన్లు ఉంటాయి. ఫ్రీజింగ్‌ (ఇన్‌స్టిట్యూట్‌లో చేరడానికి పూర్తిగా అంగీకారం తెలిపి సీటును రిజర్వు చేసుకోవడం), స్లైడింగ్‌ (ఇన్‌స్టిట్యూట్‌లో సీటు తీసుకోవడానికి అంగీకారం తెలిపి, బ్రాంచ్‌ మార్చుకొనే అవకాశం ఎంచుకోవడం), ఫ్లోటింగ్‌ (ఇన్‌స్టిట్యూట్‌ మార్చుకొనే అవకాశం ఎంపిక చేసుకోవడం) వంటివి ఉన్నాయి. ఎంత మంది ఏ ఆప్షన్‌ను ఎంచుకున్నారనే విషయం గురువారం తెలియనుంది.  

మరిన్ని వార్తలు