ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై 8 ఒప్పందాలు

5 Sep, 2020 04:17 IST|Sakshi

నెదర్లాండ్స్‌ ప్రభుత్వం, వివిధ సంస్థలు,కంపెనీలతో అవగాహన

ఈ ఒప్పందాలతో రైతులకు లబ్ధి.. ఎంవోయూ సందర్భంగా సీఎం జగన్‌

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాల్లో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం  

నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో కోర్సులు 

ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లలో అంతర్భాగంగా ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు 

మార్కెటింగ్‌ సమస్య లేకుండా పెద్ద కంపెనీలతో అనుసంధానం ముఖ్యం  

వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్, టెక్నాలజీపై దృష్టి పెట్టాం. అరటి, టమాటా, మామిడి, చీనీ, మిర్చి, కూరగాయలు సహా పలు వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తుల ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాం. తద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.

నైపుణ్యాభివృద్ధి కోసం త్వరలో ఏర్పాటు చేయనున్న కాలేజీల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ప్రత్యేక కోర్సులు నిర్వహించాలి. జిల్లాల్లో నెలకొల్పుతున్న ఇంటిగ్రేటెడ్‌ ల్యాబుల్లో అంతర్భాగంగా ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి.

సాక్షి, అమరావతి: రైతులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏడెనిమిది ప్రధాన పంటలకు సంబంధించి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాల్లో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని స్పష్టం చేశారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై శుక్రవారం సీఎం సమక్షంలో క్యాంపు కార్యాలయంలో నెదర్లాండ్స్‌ ప్రభుత్వం, వివిధ సంస్థలు, కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఈ సందర్భంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై సీఎం జగన్‌ సమీక్షిస్తూ మాట్లాడారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో పెద్ద పెద్ద కంపెనీలతో అనుసంధానం చాలా ముఖ్యమని, ఇలాంటి అంశాల్లో మహిళా గ్రూపులను ప్రోత్సహించేటప్పుడు వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ అనేది ప్రధాన అంశమని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఆక్వా ఉత్పత్తులకు తగిన ధరలు లభించేలా అడుగులు వేస్తున్నామన్నారు.
ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలు చూపుతున్న నెదర్లాండ్స్‌ కంపెనీ ప్రతినిధి కొర్నీలియా. చిత్రంలో సీఎం వైఎస్‌ జగన్, మంత్రి కన్నబాబు, అధికారులు 

అవగాహన ఒప్పందాలు
► అరటి పంటకు సంబంధించి ఎన్‌ఆర్‌సీ బనానా తిరుచ్చితో ఒప్పందం చేసుకున్నారు. కొత్త మైక్రోఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రమోషన్‌తో పాటు క్వాలిటీ టెస్టింగ్‌ ల్యాబొరేటరీలపై వారు పని చేస్తారు. ఎన్‌ఆర్‌సీతో ఒప్పందంపై ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ శివ, సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సురేష్‌ కుమార్‌ సంతకాలు చేశారు. డ్రై చేసిన అరటి ఉప ఉత్పత్తిని వారు సీఎంకు చూపించారు.  
► అరటి సహా పండ్లు, కూరగాయల ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై పుణెకు చెందిన ఫ్యూచర్‌టెక్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నారు. కంపెనీ సీఈవో అజిత్‌ సోమన్‌ ఈ సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానం (వాక్యూమ్‌ టెక్నాలజీ)పై సీఎం జగన్‌కు వివరాలు అందించారు.  
► టమాటా, అరటి ప్రాసెసింగ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనపై బిగ్‌ బాస్కెట్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ జోనల్‌ హెడ్‌ కె.రామచంద్ర కిరణ్‌ ఎంవోయూపై సంతకాలు చేశారు.  
► మామిడి, చీనీ, మిరప వంటి పంటల ప్రాసెసింగ్‌పై ఐటీసీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ జి.కృష్ణకుమార్‌ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. 
► లారెన్స్‌ డేల్‌ ఆగ్రో ప్రాసెసింగ్‌ (లీప్‌) కంపెనీ సీఈవో విజయ రాఘవన్‌ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఉల్లి ప్రాసెసింగ్‌పై దృష్టి పెట్టనున్నట్టు ఆ కంపెనీ వెల్లడించింది. 
► ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో అత్యంత కీలకమైన ఇంటీరియర్‌ ఆర్కిటెక్చర్, డిజైన్, ప్యాకేజింగ్, కంటైనర్ల అంశాలపై నెదర్లాండ్స్‌ ప్రభుత్వంతో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్‌లో న్యూఢిల్లీ నుంచి భారత్‌లో నెదర్లాండ్స్‌ అంబాసిడర్‌ మార్టెన్‌ వాన్‌ డెన్‌ బెర్గ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెదర్లాండ్స్‌ ప్రతినిధి శాన్నీ గీర్డినా క్యాంపు కార్యాలయంలో పాల్గొన్నారు. 
► రొయ్యలు, చేపల పెంపకంలో టెక్నాలజీ, మార్కెటింగ్‌ తదితర అంశాలపై ఐఎఫ్‌బీతో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది. 
► రొయ్యలు, చేపల ఎగుమతి, రిటైల్‌ మార్కెటింగ్‌పై అంపైర్‌ కంపెనీతో ఎంవోయూ చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏపీ ఫుడ్‌ కార్పొరేషన్‌ సీఈవో శ్రీధర్‌రెడ్డి, మత్స్య శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు సంతకాలు చేశారు. 
► వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశాయ్‌ ఫ్రూట్స్‌ కంపెనీ నుంచి అజిత్‌ దేశాయ్, తిరుచ్చి ఎన్‌ఆర్‌సీబీ నుంచి డాక్టర్‌ ఉమ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు