ఇంజనీరింగ్, ఫార్మసీలో 1.45 లక్షల సీట్లు 

2 Nov, 2021 03:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అత్యధికంగా సీఎస్‌ఈ, ఈసీఈలలోనే సీట్లు 

నేటి నుంచి వెబ్‌ ఆప్షన్లు 

5 వరకు ఆప్షన్లకు గడువు.. 6న మార్పులకు అవకాశం 

10న సీట్ల కేటాయింపు.. 15 నుంచి తరగతులు 

సాక్షి, అమరావతి: ఏపీఈఏపీ సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. వెబ్‌ కౌన్సెలింగ్‌కు కాలేజీల్లోని కోర్సులవారీగా సీట్ల సంఖ్యను ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. ఈ మేరకు వేర్వేరు జీవోలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర విడుదల చేశారు. తొలిసారిగా యూనివర్సిటీల కాలేజీలు, ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీల్లోని 35 శాతం సీట్లు కూడా కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తున్నారు.

2021–22 విద్యా సంవత్సరంలో తొలి విడత కౌన్సెలింగ్‌కు 1,45,421 ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యధికం కంప్యూటర్‌ సైన్సు విభాగంలో ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌ (ఈసీఈ), మెకానికల్, కెమికల్, సివిల్‌ వంటి కోర్‌ సబ్జెక్టులకు సంబంధించినవి ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి మొత్తం 435 కాలేజీలు ఈసారి కౌన్సెలింగ్‌లో ఉన్నాయి.  

నేటినుంచి వెబ్‌ ఆప్షన్లు 
వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 5వ తేదీ వరకు ఆప్షన్లను నమోదు చేయవచ్చు. 6వ తేదీన మార్పులు చేసుకోవచ్చు. 10వ తేదీన తొలి విడత సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడంతో పాటు సంబంధిత కాలేజీల్లో ఈనెల 15వ తేదీలోపు చేరాలి. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.   

మరిన్ని వార్తలు