ఈసెట్‌లో 96.12 శాతం ఉత్తీర్ణత

7 Oct, 2020 05:22 IST|Sakshi
ఫలితాలను విడుదల చేస్తున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చిత్రంలో ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి తదితరులు

బాలురు 25,160, బాలికలు 6,732 

ఫలితాలు విడుదల చేసిన మంత్రి సురేష్‌ 

సబ్జెక్టుల వారీగా టాపర్ల ప్రకటన 

సాక్షి, అమరావతి: డిప్లొమో పాసైన విద్యార్థులు ఇంజనీరింగ్‌ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈసెట్‌–2020లో 96.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. కరోనా సమయంలోనూ పరీక్షలు విజయవంతంగా నిర్వహించడంతోపాటు ఫలితాలను త్వరగా విడుదల చేశారని అధికారులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్ర, మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, ఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి.భానుమూర్తి, మండలి కార్యదర్శి సుధీర్‌ప్రేమ్‌కుమార్, ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

► సెప్టెంబర్‌ 14న ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన ఈ పరీక్షల్ని 31,891 మంది రాశారు. 30,654 మంది (96.12 శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 25,160 మంది బాలురు, 6,731 మంది బాలికలు ఉన్నారు. 
►"https://sche.ap.gov.in/ecet/'లో ఫలితాలను ఉంచారు.  అభ్యర్థులు ఈనెల 8వ తేదీ నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  

9న ఎంసెట్‌ ఫలితాలు 
ఏపీ ఎంసెట్‌ ఫలితాలను ఈనెల 9న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఈసెట్‌ ఫలితాల విడుదల సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్‌ 2 నుంచి స్కూళ్లు తెరవాలని భావిస్తున్నామని, కోవిడ్‌ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎవరికీ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. అయితే, కేంద్రం మళ్లీ ఇచ్చే మార్గదర్శకాలను అనుసరించి దీనిపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సూచనలు అందిస్తామని తెలిపారు.  

సబ్జెక్టుల వారీగా ర్యాంకర్లు 
► అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌: గొర్తి వంశీకృష్ణ, (అనంతపురం ) 
► బీఎస్సీ మేథమెటిక్స్‌: శివాల శ్రీనివాసరావు (శ్రీకాకుళం) 
► సిరామిక్‌ టెక్నాలజీ: తూతిక సంతోష్‌కుమార్‌ (ప్రకాశం జిల్లా) 
► కెమికల్‌ ఇంజనీరింగ్‌: షేక్‌ మహమ్మద్‌ ముస్తాక్‌ అహ్మద్‌ (గుంటూరు) 
► సివిల్‌: బానోతు అంజలి (ఖమ్మం) 
► కంప్యూటర్‌ సైన్స్‌: కోడి తేజ (కాకినాడ) 
► ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌: ఇ.నరేష్‌రెడ్డి (కడప) 
► ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌: కురా వైష్ణవి (గుంటూరు జిల్లా) 
► ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌: పృధ్వీ (రంగారెడ్డి జిల్లా) 
► మెకానికల్‌: గరగా అజయ్‌ (విశాఖపట్నం) 
► మెటలర్జికల్‌: వరుణ్‌రాజు (విజయనగరం) 
► మైనింగ్‌: బానాల వంశీకృష్ణ (ములుగు, ఖమ్మం జిల్లా) 
► ఫార్మసీ: బెజవాడ అశ్లేష్‌కుమార్‌ (కృష్ణా జిల్లా) 
► ఫార్మసీ: జుట్టు శాంతి (శ్రీకాకుళం జిల్లా)   

మరిన్ని వార్తలు