లంచగొండులపై ఉక్కుపాదం

7 Sep, 2020 04:19 IST|Sakshi

‘14400’ కాల్‌సెంటర్‌ విజయవంతంతో ఏసీబీ కార్యాచరణ

ప్రజల్లో ఇంకా అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం

ఇప్పటికే పది నెలల్లో 44,999 కాల్స్‌.. ఇందులో అవినీతివి 1,747

వీటి ద్వారా 13 ట్రాప్‌ కేసులు నమోదు

తాజాగా ఆయా శాఖల్లో అవినీతి తిమింగలాలపై నిఘా.. దాడులు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల మాట వినిపించకూడదని, ఎక్కడ అవినీతి ఉన్నా కూకటివేళ్లతో పెకిలించాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన ఆదేశాలతో అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) లంచ గొండుల భరతం పడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దాడులకు శ్రీకారం చుట్టింది. అవినీతి నిరోధానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘14400’ కాల్‌ సెంటర్లకు పెద్దఎత్తున కాల్స్‌ వస్తుండడంతో వీటిపైనా ఏసీబీ వేగంగా స్పందిస్తోంది. ఇప్పటికే ఈ కాల్‌సెంటర్‌పై ప్రజల్లో అవగాహన బాగా పెరిగినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. అలాగే, లంచగొండులపై నిఘాను ముమ్మరం చేసింది. 

10 నెలల్లో 44,999 కాల్స్‌
► గత ఏడాది నవంబర్‌లో ‘14400’ కాల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. 
► ఇప్పటివరకు ఈ కాల్‌ సెంటర్‌కు 44,999 కాల్స్‌ రాగా ఇందులో అవినీతికి సంబంధించిన కాల్స్‌ 1,747 ఉన్నాయి. 
► ఇందులో 1,712 ఫిర్యాదులను పరిష్కరించారు. మరో 161 కాల్స్‌పై చర్యలు తీసుకుంటున్నారు. ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 13 ట్రాప్‌ కేసులను కూడా ఏసీబీ నమోదు చేసింది. మూడు కేసుల్లో క్రిమినల్‌ దుష్ప్రవర్తన చర్యలను చేపట్టింది. 
► మరో 67 ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. 
► 46 రెగ్యులర్‌ విచారణలు.. 32 డిస్‌క్రీట్‌ విచారణలను చేపట్టారు.
► దీంతో ఈ కాల్‌సెంటర్‌ సూపర్‌హిట్‌ అయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
► అలాగే, వస్తున్న కాల్స్‌ ద్వారా ఏఏ శాఖల్లో ఏఏ అంశాలపై అక్రమార్కులు ప్రజలను లంచాలు డిమాండ్‌ చేస్తున్నారో ఏసీబీ గుర్తించింది. 
► దీని ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన తిమింగలాలతో పాటు సామాన్య ప్రజలను లంచాల పేరుతో పీడించే వారిపై తక్షణం దృష్టిసారించాలని  నిర్ణయించింది. 
► ఇందులో భాగంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్య, విద్యుత్‌ శాఖల్లో అక్రమార్కులపై ప్రధానంగా నిఘా పెట్టనుంది.

మరిన్ని వార్తలు