సాక్షి, తిరుమల : శ్రీవారి ఆలయంలోని వంటశాల(పొటు)లో ప్రమాదం సంభవించింది. చింతపండు రసం తయారు చేసే విద్యుత్ బాయిలర్ పగిలి అందులోని వేడి నీరు ఐదుగురు పోటు కార్మికులపై పడడంతో గాయాల పాలైయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వారిని తిరుమలలోని ఆశ్విని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. గాయపడ్డ కార్మికులను టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి పరామర్షించారు. టీటీడీలో ఇప్పటివరకు ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదని పోటు ఇంచార్జ్ వరద రాజులు అన్నారు. వారం రోజులకు ఓసారి అధికారులు మాస్ క్లీనింగ్ నిర్వహిస్తారని, ప్రమాదవశాత్తే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఎలాంటి ప్రాణహాని జరగకుండా ఆ స్వామివారు కాపాడారని అన్నారు. (ఘనంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు )