YS Jagan-Posani: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన నటుడు పోసాని

26 Feb, 2022 07:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సినీ నటుడు పోసాని కృష్ణమురళి కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబం కరోనాతో బాధపడుతున్న సమయంలో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి ఫోన్‌చేసి మెరుగైన చికిత్స అందించాలని చెప్పారని.. అందుకే సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చానన్నారు.

చదవండి: పవన్‌ సినిమాను తొక్కేయడమేంటి?: మంత్రి పేర్ని నాని

సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. చిన్ని సినిమాల నుండి ప్రతిపాదనలు అందాకే టికెట్ల ధరలపై నిర్ణయం వస్తుందని పోసాని తెలిపారు. సినిమా టికెట్ల ధరలపై తానేమి ముఖ్యమంత్రితో చర్చించలేదన్నారు. భీమ్లానాయక్‌ సినిమాను ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బంది పెట్టిందని ఆరోపించడం సరికాదని.. ఒకవేళ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినట్లు సాక్ష్యం ఉంటే చూపాలని పోసాని మీడియాను కోరారు. సీఎం జగన్‌పై నిందలు వేసిన వారు భూమిలో 100 అడుగుల లోతుకు పాతుకుపోతారని చెప్పారు.  

మరిన్ని వార్తలు