పబ్లిక్‌ సేఫ్టీకి ప్రాధాన్యమివ్వాలి: సుమన్‌

25 Jan, 2021 08:38 IST|Sakshi

తిరుపతి: ‘పంచాయతీ ఎన్నికలు సరైన సమయంలో జరిగి ఉంటే బావుండేది. కరోనా పరిస్థితుల్లో ప్రజలు, ఉద్యోగుల సేఫ్టీకి ప్రాధాన్యమివ్వాలి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని పబ్లిక్‌ను ఇబ్బంది పెట్టడం సరికాదు’ అని సినీనటుడు సుమన్‌ అన్నారు. ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతికి విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.  

సాక్షి : ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సబబేనా? 
సుమన్‌ :గత ఏడాదిలో ఎన్నికలను వాయిదా వేయడంతో ఇలాంటి పరిస్థితి వచ్చింది. అధికారులు, నాయకులు ప్రజలు, ఉద్యోగుల సేఫ్టీకి ప్రాధాన్యతనివ్వాలి. 

సాక్షి: సినీ పరిశ్రమ కరోనా నుంచి కోలుకుందా? 
సుమన్‌: సినీ పరిశ్రమకు కరోనాతో పెద్ద దెబ్బతగిలింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సినిమా షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. సినిమా థియేటర్లు ప్రస్తుతం 50శాతం సీటింగ్‌తో నడుస్తున్నాయి. వంద శాతంతో థియేటర్లు నడిస్తే కోలుకున్నట్టే.   

సాక్షి: మూడు రాజధానులపై మీ అభిప్రాయం? 
సుమన్‌: ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేశారు. రాష్ట్రం విడిపోయాక కూడా అదే తప్పు పునరావృతమైంది. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిది.    

సాక్షి: ఆలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించడం సబబేనా? 
సుమన్‌: ఇది చాలా విచారకరం. కొందరు కావాలని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దీనిపై సీఎంను విమర్శించడం, ప్రభుత్వానికి అంటగట్టడం దారుణం.  

సాక్షి: ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం? 
సుమన్‌: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోని వచ్చిన అతి తక్కువ సమయంలోనే రాష్ట్రంలోని పేద మహిళలకు లక్షలాది ఇంటిపట్టాలు పంపిణీ చేయడం అద్భుతం. ప్రతి రాష్ట్రంలోని పాలకులు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి.

సాక్షి: రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందంటారు? 
సుమన్‌: ప్రజలు యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ సీఎంను ఎన్నుకున్నారు. సాధారణ మధ్య తరగతి ప్రజలు పరిపాలన విషయంలో సంతోషంగా ఉన్నారనేది నా అభిప్రాయం.  

సాక్షి: తిరుపతి, తిరుమల అభివృద్ధి ఎలా ఉంది..! 
సుమన్‌: వేగంగా అభివృద్ధి జరుగుతోంది. ప్రస్తుతం తిరుమలలో వసతులు బాగున్నాయి. అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు