ఆదివాసీ రైతు.. అభివృద్ధి పథంలో సాగుతూ.. 

16 Oct, 2022 12:17 IST|Sakshi

వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు ఎంపిక

గిరిసీమల్లో లాభాల పంట పండిస్తున్న ముక్కయ్య  

ఆదివాసీ జీడిమామిడి రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి గుర్తింపు

బుట్టాయగూడెం(ఏలూరు జిల్లా):  పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు ఎటువంటి రసాయనాలను వినియోగించకుండా ఆరోగ్యవంతమైన పంటలు పండించేలా కృషి చేస్తున్న ఆదివాసీ జీడిమామిడి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ సీఈఓ సోడెం ముక్కయ్యను వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారం వరించింది. గిట్టుబాటు ధరతో పాటు నేరుగా పంటలను విక్రయించుకునేలా రైతులకు తోడ్పాటునందించేలా గురుగుమిల్లిలో 2019లో నాబార్డు సహకారంతో ఆయన ఆదివాసీ జీడిమామిడి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ను ఏర్పాటుచేశారు.

అలాగే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంక్‌ సహకారంతో ఆదివాసీ జీడిమామిడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పారు. ఆయా సంస్థల ద్వారా ఏటా లక్షలాది రూపాయల అమ్మకాలు చేస్తున్నారు. దీంతోపాటు 200 ఎకరాల్లో జీడిమామిడి పంటలను ప్రోత్సహించడంతోపాటు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల ద్వారా రైతులు పంటలు పండించేలా ముక్క య్య కృషి చేస్తున్నారు. ప్రస్తుతం వీరి సంస్థలో 714 మందికి పైగా రైతులు పనిచేస్తున్నారు. వ్యవసా యాభివృద్ధి లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు.  

చాలా ఆనందంగా ఉంది 
గురుగుమిల్లి వంటి మారుమూల గ్రామంలో పనిచేస్తున్న నేను వైఎస్సార్‌ సాఫల్య పురస్కారానికి ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ గుర్తింపుతో మరింత బాధ్యత పెరిగింది. గిరిజన ప్రాంతంలో వ్యవసాయాభివృద్ధికి మరింత కృషి చేస్తా. 
– సోడెం ముక్కయ్య 
 

మరిన్ని వార్తలు