క్యాన్సర్‌ రోగులకు అధునాతన సేవలు

6 Apr, 2022 04:45 IST|Sakshi

గుంటూరులో హాస్పైస్, పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు

చినకాకానిలో ప్రివెంటివ్‌ అంకాలజీ విభాగం

సాక్షి, అమరావతి: క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు రాష్ట్రం లోనే అధునాతన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గుంటూరులో అధునాతన హాస్పైస్, పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి (జీజీ హెచ్‌కి) అనుబంధంగా గుంటూరులోని బొంగరాలబీడులో అధునాతన హాస్పైస్‌ పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వచ్చే వరకు గుంటూరు జీజీహెచ్‌లో తాత్కాలిక కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. తాత్కాలిక కేర్‌ సెం టర్‌లో ఇరవై నాలుగ్గంటలూ వైద్యుడు, ఆరుగురు నర్సులు, న్యూట్రిషియన్, సిబ్బంది రోగులకు సేవలందిస్తారు. పాలియేటివ్‌ కేర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు.

ఏమిటీ హాస్పైస్, పాలియేటివ్‌ కేర్‌
క్యాన్సర్‌తో బాధపడుతూ కీమోథెరపీ, రేడియేషన్‌ వంటి చికిత్సలు చేయించుకొనే రోగుల్లో తీవ్రమైన  నొప్పి, బాధ ఉంటుంది. రేడియేషన్, కీమోథెరపీ పూర్తయి వ్యాధి నయం అవ్వక అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌తో ఉన్న వారికి జీవితం నరకప్రాయమే అవుతుంది. ఆస్పత్రిలో ఉన్నా జబ్బు నయం కాదు. ఇంటి దగ్గర నొప్పి, బాధకు ఉపశమనం లభించదు. ఇటువంటి రోగులకు శారీరక, మానసిక సాంత్వన చేకూర్చడమే హాస్పైస్,  పాలియేటివ్‌ కేర్‌ ఉద్దేశం. 

చినకాకానిలో అకడమిక్‌ రీసెర్చ్‌ 
సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ ఆధ్వర్యంలో చినకాకానిలో నడుస్తున్న క్యాన్సర్‌ ఆసుపత్రిలో ప్రివెంటివ్‌ అంకాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.  

ఈ నెలాఖరుకు అందుబాటులోకి
రాష్ట్రంలో క్యాన్సర్‌కు అధునాతన వైద్యం అందించాలన్నది సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం.  ఈ నెలాఖరు కు గుంటూరులో హాస్పైస్,  పాలియేటివ్‌ కేర్‌ సెంట ర్, చినకాకానిలో ప్రివెంటివ్‌ అంకాలజీ, అకడమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభించబోతున్నాం.
– నవీన్‌ కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి  

మరిన్ని వార్తలు