ఈ నెల 29వ తేదీ వరకు చెన్నైలో నిర్వహణ
ఏపీ, తెలంగాణ, తమిళనాడు యువతకు అవకాశం
సాక్షి, అమరావతి: అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని నవంబర్ 15 నుంచి 29వ తేదీ వరకు చెన్నైలో నిర్వహించనున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ర్యాలీలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు యువత పాల్గొనవచ్చు. అగ్నివీర్(మెన్), అగ్నివీర్ (మహిళా మిలటరీ పోలీస్), సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్ (వెటర్నరీ), జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ ర్యాలీ నిర్వహించనున్నారు.
ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు www.joinindianarmy. nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులు తీసుకువెళ్లాల్సిన ధ్రువీకరణపత్రాలు, ఇతర సమాచారం మొత్తం వెబ్సైట్లోని నోటిఫికేషన్లో ఉంటుంది. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, యువత దళారుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ఆర్మీ వర్గాలు స్పష్టంచేశాయి.