రైతులు పైసా కట్టక్కర్లేదు

3 Sep, 2020 03:11 IST|Sakshi

సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం

ఉచిత విద్యుత్తుపై నగదు బదిలీతో అన్నదాతలకు లాభమే

డబ్బులిస్తున్నందున విద్యుత్తు నాణ్యతపై వారికి నిలదీసే హక్కు ఉంటుంది

అధికారులు సైతం బాధ్యతతో వ్యవహరిస్తారు

రైతులకు వైఎస్సార్‌ ఇచ్చిన ఉచిత విద్యుత్‌ కొనసాగుతుంది

సీఎం జగన్‌ కలలో కూడా రైతులకు అన్యాయం చేయరు

కేంద్రం తెచ్చిన సంస్కరణల వల్లే  మార్పులు

చంద్రబాబుది కపట నాటకం

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలకు అనుగుణంగానే వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని చేపట్టాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్తు కోసం రైతులు పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదని, మీటర్లకయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. బిల్లు చెల్లిస్తారు కనుక విద్యుత్తు నాణ్యతపై రైతులకు అధికారులను నిలదీసే హక్కు ఉంటుందని చెప్పారు. అధికారులు కూడా మరింత బాధ్యతగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. బుధవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉచిత విద్యుత్తుపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఉచిత విద్యుత్తు పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని తెలిపారు.

కనికరం లేకుండా కాల్పులు జరిపించారు..
ఉమ్మడి రాష్ట్రంలో ఏడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా నాటి చంద్రబాబు సర్కారు కనికరించలేదు. కరవు వెంటాడుతున్నా నిర్దాక్షిణ్యంగా వ్యవసాయ విద్యుత్‌ ధర హార్స్‌పవర్‌ రూ. 50 నుంచి రూ. 650కి పెంచింది. విద్యుత్తు బిల్లులు కట్టలేదని రైతులపై కాల్పులు జరపడంతోపాటు జైళ్లలో పెట్టిన ఘనత చంద్రబాబు సర్కారుదే.

వైఎస్సార్‌ ఆశయాల దిశగానే...
– ఈ పరిస్థితిని చూసి చలించిన దివంగత వైఎస్సార్‌ అధికారం చేపట్టగానే దేశానికే ఆదర్శమైన ఉచిత విద్యుత్పథకాన్ని తెచ్చారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య, ఉచిత విద్యుత్తు రైతు ఇంట ఆనందాన్ని నింపాయి. రూ. 50 వేల కోట్లతో రైతుల కోసం జలయజ్ఞం చేపట్టిన ఘనత వైఎస్సార్‌దే.
– వైఎస్సార్‌ చేపట్టిన ప్రతీ పథకాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకేసీఎం జగన్‌ శ్రమిస్తున్నారు. 

బాబు మాటలు బూటకం..
మిగులు విద్యుత్తు అంటూ చంద్రబాబు చెప్పే మాటలు బూటకం. రాష్ట్ర విభజన నాటికే ఏపీలో 55 శాతం విద్యుత్‌ఉత్పత్తి ఉండగా తెలంగాణాలో 45 శాతం ఉంది.  వినియోగం తెలంగాణలో 57 శాతం, ఏపీలో 43 శాతం ఉంది. ఏపీలో 12 శాతం అదనపు ఉత్పత్తి ఉంది. ప్రైవేటు విద్యుత్ను ప్రోత్సహించేందుకు థర్మల్‌ విద్యుత్తు పీఎల్‌ఎఫ్‌ తగ్గించడమే చంద్రబాబు ఘనత.

ఆ బకాయిలన్నీ సీఎం జగన్తీరుస్తున్నారు
– వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు సరఫరా కష్టమైనా సీఎం జగన్‌ సాహసంతో అమలు చేస్తున్నారు. ఫీడర్ల బలోపేతం కోసం రూ. 1,700 కోట్లు మంజూరు చేశారు.  
 – గత సర్కారు రూ.34 వేల కోట్ల మేర విద్యుత్తు బకాయిలు పెట్టి వెళ్లిపోతే సీఎం జగన్‌ వాటిని తీరుస్తున్నారు.  విద్యుత్సబ్సిడీలకు సంబంధించి రూ.17,904 కోట్లు ఖర్చు పెట్టారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఇందులో సగం కూడా ఇవ్వలేదు.
– ఈ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్సబ్సిడీ కోసం రూ.7 ,171 కోట్లు ఇచ్చింది. అక్వాసాగుదారులకు రూ.700 కోట్లు ఇచ్చింది. అన్ని రకాల ఉచిత విద్యుత్తు సబ్సిడీలు కలిపి రూ.11,000 కోట్లు ఇచ్చింది. 
 
కేంద్రం తెచ్చిన సంస్కరణలతో..
–సంస్కరణల దిశగా కేంద్రం వేస్తున్న అడుగులను అన్ని రాష్ట్రాలు అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదనపు నిధులపై కొన్ని షరతులు విధించింది. విద్యుత్సబ్సిడీని రైతుల ఖాతాలకు బదిలీ చేయాలనేది ఇందులో ప్రధానమైనది.
డిసెంబర్లోగా ఒక్క జిల్లాలో అయినా ప్రయోగాత్మకంగా నగదు బదిలీ అమలు చేసి వచ్చే సంవత్సరం రాష్ట్రమంతా విస్తరిస్తామని చెబితేనే అప్పులపై కేంద్రం వెసులుబాటు కల్పిస్తుంది.  

మరిన్ని వార్తలు