నూతన విద్యా విధానంతో ఉజ్వల భవిష్యత్తు

15 Jul, 2022 04:35 IST|Sakshi
తుంబకుప్పం గ్రామంలో అజేయ కల్లంతో గ్రామ సచివాలయ సిబ్బంది

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం

బంగారుపాళెం: నూతన విద్యా విధానంతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, రిటైర్డ్‌ సీఎస్‌ అజేయ కల్లం అన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలోని నల్లంగాడు, తుంబకుప్పం గ్రామ సచివాలయాలను గురువారం ఆయన సందర్శించారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై అక్కడి సిబ్బందిని ఆరా తీశారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ఈ సందర్భంగా.. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం ద్వారా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు అడిగిన ప్రశ్నకు అజేయ కల్లం సమాధానం ఇస్తూ.. గతంలో 2, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లి చదువులు సాగించిన విషయాన్ని గుర్తుచేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులందరూ కలిసి చదువుకోవడం వల్ల తెలివితేటలు బాగా ఉండేవని, పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొని ఉండేదని తెలిపారు.

ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న విద్యావిధానం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తోందని చెప్పారు. అజేయ కల్లంను జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ రామచంద్రారెడ్డి, ఎంపీపీ అమరావతి, వైస్‌ ఎంపీపీ శిరీష్‌రెడ్డి, సర్పంచులు ధనంజయరావు, లీలావతమ్మ, రంజిత్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ బెన్‌రాజ్, ఇన్‌చార్జి ఎంపీడీవో సందీప్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. 

మరిన్ని వార్తలు