వరద బాధితులకు తక్షణ సాయం కోసం కేంద్రంపై ఒత్తిడి
సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల తుపాను, వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 14, 15 తేదీల్లో ఢిల్లీకి అఖిల పక్ష బృందం వెళ్లాలని ఆదివారం విజయవాడలో జరిగిన విపక్షాల రౌండ్టేబుల్ సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో అపార నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించలేదని సమావేశం అభిప్రాయపడింది.
సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షత వహించారు. ప్రముఖ రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. తుపాను వరదలతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చడానికి కేంద్రం తక్షణమే సాయం అందించాలని ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య కోరారు.