ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్
ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే
4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
ప్రతి ప్రక్రియ నిఘా నీడలో
గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డిన అభ్యర్థులు
అమరావతి: పంచాయతీ సమరం తుది ఘట్టానికి చేరింది. రేపటితో పంచాయతీ పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి. మూడో విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే విశాఖపట్టణం, తూర్పు గోదావరి ఏజెన్సీ గ్రామాల్లో మాత్రం మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ జరపనున్నారు.
13 జిల్లాల్లోని 20 డివిజన్లు 160 మండలాల్లో 2,640 పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. అయితే మూడో విడతలో మొత్తం పంచాయతీలు 3,221 ఉండగా వాటిలో 579 ఏకగ్రీవం అయ్యాయి. రేపు ఎన్నికలు జరిగే పంచాయతీలు 2,640 ఉన్నాయి. అయితే మూడు పంచాయితీల్లో నామినేషన్లు నమోదు కాలేదు.
60 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఎన్నికల సామగ్రిని సరఫరా చేశారు. రాత్రికి ఎన్నికల సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లనుంది. మూడో విడతలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 26,851 ఏర్పాటుచేశారు. వీటిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 4,118 గుర్తించారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 3,127 ఉన్నాయి. నక్సల్స్ ప్రభావిత పోలింగ్ కేంద్రాలు 1,977.
ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఈసీ, డీజీపీ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టనున్నారు. ఎస్ఈసీ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్, కౌంటింగ్ ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది.