మంత్రి చొరవతో గర్భిణికి తప్పిన ప్రమాదం

4 Oct, 2020 20:37 IST|Sakshi

సాక్షి, విజయనగరం : ఏపీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చొరవతో ఆదివారం గర్భిణీ స్త్రీ మహిళకు ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా ధారపత్తి పంచాయతీ పొర్లు గ్రామంలో గర్భిణీ చంద్రమ్మ ప్రయాణ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న ఘటనపై ఆళ్ల నాని తక్షణమే స్పందించారు. డోలి మోతలో తీసుకు వెళుతున్న చంద్రమ్మను ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు 108 వాహనం ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు గర్భిణీ స్త్రీ చంద్రమ్మకు మెరుగైన వైద్యం అందించడానికి డైరెక్టర్ అఫ్ మెడికల్ అండ్ హెల్త్ డాక్టర్ అరుణ కుమారి అ‍న్ని ఏర్పాట్లు చేశారు.చంద్రమ్మను 108అంబులెన్సులో విజయనగరంలో ఘోష ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించడంతో ఆమెకు ప్రమాదం తప్పింది. (చదవండి : గంట్యాడ ఘటనపై మంత్రి ఆళ్ల నాని ఆరా)

ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌ హరి జవహర్ లాల్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆళ్ల నాని శృంగవరపు మండలం పొర్లు గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకు ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సదుపాయం కోసం గిరిజన వైద్య వసతి గృహాలు ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.గర్భిణీ స్త్రీలకు వసతి గృహాల్లో వెంటనే వైద్యం అందడానికి అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు కార్పొరేట్ వైద్యం అందడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మల్టీ స్పెషలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టారన్నారు. కాగా చంద్రమ్మ విషయంలో సత్వరమే స్పందించి చర్యలు చేపట్టిన డీఎమ్‌ఈ డాక్టర్ అరుణ కుమారి, డీఎమ్‌హెచ్‌ఓ డాక్టర్ రమణ కుమారిని మంత్రి అభినందించారు. 
 

మరిన్ని వార్తలు