వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రుల్లో బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు కలెక్టరేట్లో కరోనా జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్ని నాని అధ్యక్షతన శనివారం జరిగింది. మంత్రి ఆళ్ల నాని ఏమన్నారంటే..
► కోవిడ్ ఆస్పత్రులతో పాటు, కోవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆహారం విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకోవాలి.
► కోవిడ్ను ఎదుర్కోవడం కోసం నెలకు రూ.350 కోట్ల పైగా ప్రభుత్వం ఖర్చు పెడుతోంది.
► టోల్ఫ్రీ నంబర్ 104కి సంబంధించి గ్రామ సచివాలయాల్లో విస్తృత ప్రచారం చేయాలి.
► ఎవరైనా ఫోన్ చేసి హాస్పిటల్లో బెడ్ కావాలని కోరితే అరగంటలోగా బెడ్ ఏర్పాటు చేయకపోతే చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు.
► జ్వరం వచ్చి, శ్వాసకోశ సమస్యలతో బాధపడితే టెస్ట్లతో సంబంధం లేకుండా వెంటనే వైద్యం కోసం ఆస్పత్రిలో చేర్చుకోవాలి.
► ఈ కార్యక్రమంలో మంత్రులు చెరుకువాడ రంగనాథరాజు, తానేటి వనిత తదితరులు పాల్గొన్నారు.