అగ్ని ప్రమాదంపై విచారణకు కమిటీ ఏర్పాటు : ఆళ్ల నాని

9 Aug, 2020 13:56 IST|Sakshi

సాక్షి, కృష్ణా: కరోనా పేషెంట్ల కోసం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన ‌అగ్ని ప్రమాద ఘటన బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ముందుగా ఘటన స్థలాన్ని సందర్శించి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. తెల్లవారుజామున 4:45 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందన్నారు. వెంటనే ఉదయం 5:09 గంటలకి ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారని తెలిపారు. ఉదయం 5:13 గంటలకు ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లారని చెప్పారు. ప్రమాదం నుంచి 18 మందిని వెంటనే రెస్క్యూ చేశారని తెలిపారు. (అగ్నిప్రమాద ఘటనపై వైఎస్‌ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్)

ప్రమాదంపై విచారణకు కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించామని చెప్పారు. రమేష్ ఆస్పత్రి నిర్లక్ష్యం ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే హోటల్, రమేష్ ఆస్పత్రిపై కేసు నమోదు చేశామని చెప్పారు. 304, 308, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం వెల్లడించారు. అగ్నిప్రమాద ఘటనలో 10 మంది మృతి చెందారని వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని, మిగిలిన 21 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. కరోనాకు138 ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఆస్పత్రులకే కరోనా బాధితులు వెళ్లాలని తెలిపారు. ప్రమాదంపై నివేదిక వచ్చిన తరువాత అన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై  ఒక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. విజయవాడలో 15 ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స చేస్తున్నారని తెలిపారు. (విజయవాడ‌ అగ్ని ప్రమాదం.. ప్రభుత్వం సీరియస్‌)

ప్రమాదంపై హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ప్రమాద కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేవలం 48 గంటల్లో ఘటనకు సంబంధించిన నివేదికను కమిటీ ఇస్తుందని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వంతో మృతి చెందిన ఒక్కొక్కరికి రూ.50లక్షలు ప్రకటించారని చెప్పారు. మంత్రి ఆళ్ల నానితో పాటు హోం​ మంత్రులు సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని, ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. (ప్రమాద కారకులపై కఠిన చర్యలు..)

>
మరిన్ని వార్తలు