సాక్షి, కర్నూలు: కరోనాను నియత్రించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా ప్రతి కరోనా పేషెంటుకు పౌష్టికాహారం అందించడానికి ఒక్కొక్కరిపై 500 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న మాట వాస్తవం అన్నారు. గతంలో కంటే ప్రస్తుతం టెస్టింగ్ ల్యాబ్ల సామార్థ్యాన్ని పెంచామని తెలిపారు. అన్లాక్, టెస్టుల సంఖ్య పెంచడం వల్ల కేసులు పెరుగుతున్నాయన్నారు. కర్నూలు కోవిడ్ ఆస్పత్రిలో 3880 బెడ్లను అందుబాటులో ఉంచామని.. ఇంకా పెంచుతామని తెలిపారు. కోవిడ్ ఆస్పత్రిలో అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు సిబ్బందిని పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
కరోనా పేషెంట్ల ఆహార నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు ఆళ్ల నాని. ఫుడ్ విషయంలో కాంట్రక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేషెంట్ల దగ్గర నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తే.. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కష్టపడుతుంటే.. చంద్రబాబు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.