రమేష్‌ను చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారు?

24 Aug, 2020 17:00 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అమరావతిలో ప్రజా ఉద్యమమే లేదు. అక్కడ జరిగేది భూస్వామ్య, పెట్టుబడిదారి, ధనవంతుల ఉద్యమం అన్నారు వైస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నట్టు భ్రమ కల్పిస్తున్నారు. అమరావతి అనేది పెద్ద స్కాం. చంద్రబాబు తన తాబేదార్లు కోసం పెట్టిందే అమరావతి. రాజధాని కోసం 85 మంది చనిపోయిన దాఖలాలు లేవు. అదంతా ఓ కట్టుకథ. రాజధాని కోసం త్యాగాలు లేవు. సాధారణంగా చనిపోయిన వారిని అమరావతి కోసం చనిపోయారని ప్రచారం చేస్తున్నారు. 85 మంది అమరావతి కోసం చనిపోతే ఉద్యమమం ఇలా ఉంటుందా. దళితులకు ఇచ్చిన భూములను టీడీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారు. అమరావతిలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. త్వరలో మరికొంత మందిని అరెస్ట్ చేస్తారు. అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం వలన మనం నష్ట పోయాం. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ చేశారు’ అని స్పష్టం చేశారు అంబటి. (డాక్టర్‌ రమేష్‌ను మీ ఇంట్లో దాచారా బాబూ?)

అంతేకాక ‘జూమ్‌లో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఎవరిని సంప్రదించకుండా మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నారని మాట్లాడటానికి చంద్రబాబుకు సిగ్గుండాలి. పరిపాలన వికేంద్రీకరణపై శాసనసభలో చర్చ జరిగింది. ఆ రోజు చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయారు. పీడిత ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ మద్దతు తెలుపుతున్నారు. తమది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియానా.. లేక క్యాప్టలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానా అనే దానికి రామకృష్ణ సమాధానం చెప్పాలి. నేరం జరిగినప్పుడు దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రమేష్ హాస్పిటల్స్ నిర్లక్ష్యం కారణంగా పది మంది చనిపోయారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా. అప్పుడు నిమ్మగడ్డ రమేష్, ఇప్పుడు డాక్టర్ రమేష్‌ను చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారు. ఎందుకు దాస్తున్నారు.. తనని పోలీసులకు అప్పగించాలి. విచారణకు రమేష్ సహకరించాలి. తనని ఎక్కడ దాచారో చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు అంబటి.

>
మరిన్ని వార్తలు