పట్టణాల్లో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ 

25 Nov, 2020 03:25 IST|Sakshi

ఆస్తి పన్ను, ఖాళీ జాగాలపై పన్ను రేట్ల సవరణ ప్రతిపాదనలు 

పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో ఆస్తి పన్ను, ఖాళీ జాగాలపై పన్ను రేట్లను హేతుబద్ధీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేటగిరీలవారీగా సవరించిన పన్ను రేట్లను ప్రతిపాదిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని అనుసరించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకమండళ్లు ఆస్తి పన్ను, ఖాళీ జాగాలపై పన్ను రేట్లను నిర్ణయిస్తూ ప్రజల అభిప్రాయాలు సేకరించి తీర్మానాలు చేయాలి. అనంతరం ఆమోదించిన తీర్మానాలను ప్రభుత్వానికి సమర్పించాలి. దీనిపై పురపాలకశాఖ తుది నిర్ణయం తీసుకుని పన్ను రేట్లను నిర్ణయిస్తుంది. పురపాలకశాఖ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.. 

ఆస్తి పన్ను రేట్లు ఇలా.. 
► నివాస గృహాలకు ప్రభుత్వ ధర ప్రకారం ఆస్తి విలువలో 0.10 శాతానికి తగ్గకుండా 0.50 శాతానికి మించకుండా ఆస్తి పన్నును ప్రతిపాదించారు. 
► వాణిజ్య భవనాలకు ప్రభుత్వ ధర ప్రకారం ఆస్తి విలువలో 0.20 శాతానికి తగ్గకుండా 2 శాతానికి మించకుండా ఆస్తి పన్ను ప్రతిపాదించారు. 
​​​​​​​► ఒక మున్సిపాలిటీ / మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అంతటా ఆస్తి పన్ను రేట్లు ఒకేలా ఉండాలి.  
​​​​​​​► 375 చదరపు అడుగుల ప్లింత్‌ ఏరియాలోపు నిర్మించిన ఇళ్లలో ఇంటి యజమాని నివాసం ఉంటే ఏడాదికి నామమాత్రంగా రూ.50 ఆస్తిపన్నుగా నిర్ణయించారు.   

ఖాళీ జాగాలపై పన్ను రేట్లు ఇలా 
​​​​​​​► మున్సిపాలిటీలలో ప్రభుత్వ ధర ప్రకారం ఖాళీ జాగా అంచనా విలువపై 0.20 శాతం. 
​​​​​​​► మున్సిపల్‌ కార్పొరేషన్లలో ప్రభుత్వ ధర ప్రకారం ఖాళీ జాగా అంచనా విలువపై 0.50 శాతం. 
​​​​​​​► ఖాళీ జాగాలలో చెత్త / ఇతర వ్యర్థాలు వేస్తే మున్సిపాలిటీలలో అదనంగా 0.10 శాతం, కార్పొరేషన్లలో అదనంగా 0.25 శాతం పెనాల్టీ విధిస్తారు.  

అనధికార నిర్మాణాలపై జరిమానాలు 
​​​​​​​► అనుమతులకు మించి 10 శాతం అతిక్రమణలు ఉంటే విధించిన ఆస్తిపన్నుపై 25 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. 
​​​​​​​► అనుమతులకు మించి 10 శాతాని కంటే ఎక్కువగా అతిక్రమణలు ఉంటే విధించిన ఆస్తిపన్నుపై 50 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. 
​​​​​​​► అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు (ఫ్లోర్లు) నిర్మిస్తే విధించిన ఆస్తిపన్నుపై 100 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. మొత్తం భవనమే అనధికార నిర్మాణం అయితే కూడా ఇదే జరిమానా వర్తిస్తుంది.  

వీటికి పన్ను మినహాయింపులు 
​​​​​​​► ప్రభుత్వం గుర్తించిన చౌల్ట్రీలు, సేవా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, లైబ్రరీ/ మైదానాలు లాంటి ప్రజోపయోగ స్థలాలు,  పురాతత్వ ప్రదేశాలు, ఛారిటబుల్‌ ఆసుపత్రులు, రైల్వే ఆసుపత్రులు, శ్మశానాలు మొదలైన స్థలాలకు ఆస్తిపన్ను, ఖాళీ జాగా పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు.  
​​​​​​​► సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలు నివసించే ఒక ఇంటికి లేదా ఖాళీ జాగాకు పన్ను మినహాయింపు 
కలి్పంచారు.   

మరిన్ని వార్తలు