అమెరికన్ వైద్యుల పరిశోధనలో వెల్లడి
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణకు వాడుతున్న మందుల్లో రెమ్డెసివిర్ అత్యంత ప్రభావశీలంగా ఉందని అమెరికన్ వైద్యులు వెల్లడించారు. సుమారు 1,062 మంది బాధితులకు వివిధ దశల్లో ఈ మందును వాడారు. మిగతా మందులతో పోలిస్తే దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. కోవిడ్ దశలను బట్టే కాకుండా, వివిధ వయసుల వారీగా కూడా మందును వినియోగించి తదనంతర ఫలితాలను సమీక్షించారు.
పరిశీలనలో వెల్లడైన విషయాలు..
► మొత్తం పది రోజుల కోర్సులో 200 ఎంజీ, ఆ తర్వాత 9 రోజులు 100 ఎంజీ డోసు వాడారు.
► మొత్తం 1,062 మంది పేషెంట్లలో 541 మందిలో రెమ్డెసివిర్, 521 మందిలో ప్లాసిబోను వినియోగించారు.
► రెమ్డెసివిర్ వాడిన వారు 10 రోజుల్లో కోలుకోగా, ప్లాసిబో వాడిన వారు కోలుకునేందుకు 15 రోజులు పట్టింది.
► రెమ్డెసివిర్ వాడిన వారిలో మరణాలు 6.7 శాతం కంటే తక్కువగా నమోదయ్యాయి.
► ప్రతికూల ఫలితాలు చూసినా.. ప్లాసిబో కంటే రెమ్డెసివిర్లో తక్కువగా ఉన్నట్టు తేలింది.
► శ్వాస తీసుకోవడం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రెమ్డెసివిర్ తీసుకోవచ్చని వైద్యులు చెప్పారు.