నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్‌

19 Mar, 2021 09:05 IST|Sakshi

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు కార్పొరేషన్‌ నూతన మేయర్‌గా ఎన్నికైన అముద ప్రస్థానం.. కష్టాల్లో ఆగిపోకుండా నిలదొక్కుకోవాలనే ఎందరో మహిళలకు ఆదర్శం. కుటుంబం గడవడం కోసం ఒకప్పుడు అముద కట్టెలు కొట్టి అమ్మింది. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతోంది. జగన్‌ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. వైఎస్సార్‌సీపీ తరఫున కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడమేగాక ఇప్పుడు ఏకంగా చిత్తూరు మేయర్‌గా ఎన్నికైంది.

దీనిపై అముద స్పందిస్తూ.. ‘‘మాది పేద కుటుంబం. అమ్మానాన్న చనిపోయేనాటికి నాకు ఊహ కూడా తెలియదు. అక్క నాగభూషణం కుటుంబ బాధ్యత తీసుకుంది. అక్కతోపాటు పనికిపోయేదాన్ని. ఆమె పడుతున్న కష్టం చూసి.. మేముంటున్న చోటి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడివికిపోయి కట్టెలు కొట్టేదాన్ని. వాటిని మోసుకొచ్చి మా కాలనీలో అమ్మితే రూ.20 వచ్చేవి. మేం ముగ్గురు అక్కాచెల్లెళ్లం, ఓ తమ్ముడు. ఇంత కష్టపడితే ఇప్పుడిçప్పుడే జీవితంలో స్థిరపడ్డాం. నేనెవరో కూడా జనానికి తెలియదు. అయితే జగనన్నను చూసి ఓట్లేసి నన్ను గెలిపించారు. ఇప్పుడు మేయర్‌ను చేశారు. ఇది నా జీవితంలో అస్సలు ఊహించలేదు. ప్రజలకు నమ్మకంగా ఉండి.. పార్టీకి మంచిపేరు తీసుకొస్తాను’’ అని తెలిపారు.
చదవండి:
మామ అటెండర్‌గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్‌ 
రాయచోటి మున్సిపల్‌ చైర్మన్‌గా కూరగాయల వ్యాపారి

మరిన్ని వార్తలు