మార్కెట్‌లోకి అమూల్‌ తాజా పాలు, పెరుగు ఉత్పత్తులు 

11 Mar, 2022 03:38 IST|Sakshi
అమూల్‌ ఉత్పత్తులను పరిశీలిస్తున్న ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ బాబు.ఎ, అమూల్‌ సీజీఎం మనోరంజన్‌ పాణి తదితరులు

లబ్బీపేట (విజయవాడ తూర్పు): విస్తృత శ్రేణిలో పాలు, పాల ఉత్పత్తులను అమూల్‌ బ్రాండ్‌తో విక్రయిస్తున్న గుజరాత్‌ కో–ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌ లిమిటెడ్‌) గురువారం అమూల్‌ తాజా పాలు, పెరుగును ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌లోకి విడుదల చేసింది. విజయవాడలోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ బాబు.ఎ ఉత్పత్తులను లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు.

అందులో భాగంగా అమూల్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పాల సహకార సంఘాలు ఏర్పాటైనట్లు చెప్పారు. అమూల్‌ పాల కర్మాగారాన్ని విజయవాడ సమీపంలో ఏర్పాటు చేశారని, అక్కడ అత్యాధునిక సౌకర్యాలున్నాయని తెలిపారు. అమూల్‌ సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ మనోరంజన్‌ పాణి మాట్లాడుతూ.. దేశంలో అతి పెద్ద ఆహార సంస్థ అయిన అమూల్‌ రైతు సహకార ఉద్యమ శక్తికి మహోన్నతమైన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ రాజన్‌ జంబునాథన్‌ మాట్లాడుతూ  అమూల్‌ పాలు, పెరుగు ఉత్పత్తులు విజయవాడ మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. 

మరిన్ని వార్తలు